హరికి బాబు చేయి, బిజెపి వైపు..: వెంకయ్య అసహనం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణకు ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఝలక్ ఇచ్చినట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటి వరకు టిడిపి ప్రకటించిన ఐదు జాబితాలలోను హరి పేరు లేదు. హరికృష్ణను పోటీ చేయించే ఉద్దేశ్యం చంద్రబాబుకు లేనట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పోటీ చేస్తారా అనే ఉత్కంఠకు దాదాపు తెరపడినట్లే అంటున్నారు.
శనివారం నామినేషన్లకు చివరి రోజు. ఇప్పటి వరకు హరి పేరు జాబితాలో లేదు. హరికృష్ణ హిందూపురం పైన ఆసక్తి కనబర్చారు. ఆ తర్వాత పెనమలూరు నుండి పోటీ చేస్తానని చంద్రబాబుకు పాదయాత్ర సమయంలో చెప్పారు. రెండు రోజులుగా.. నూజివీడు లేదా విజయవాడ తూర్పు ఇవ్వవచ్చుననే ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ కూడా టిడిపి ఇతరులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో హరికృష్ణను పోటీకి దూరంగా ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
తనకు ఏ టిక్కెట్ కేటాయించక పోవడంపై హరికృష్ణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పెనమలూరు, హిందూపురం అసెంబ్లీ, హిందూపురం లోకసభ తదితర నియోజకవర్గాలు కోరుకున్నా అవి దక్కలేదు. నూజివీడు కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పుడు దానికి కూడా ఆయన సిద్ధమన్నారు. అయినా టిక్కెట్ దక్కలేదు. టిక్కెట్ ఇవ్వకుంటే హరి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఆయన బిజెపి వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. టిడిపి, బిజెపి పొత్తు తెగతెంపులైతే కాషాయదళంలో చేరి పోటీ చేయాలని చూస్తున్నారట.
పొత్తుపై వెంకయ్య
టిడిపి, బిజెపి పొత్తు కిరికిరి నేపథ్యంలో చంద్రబాబుతో ప్రకాశ్ జవదేకర్ భేటీ అయ్యారు. దీనిపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ... పొత్తుపై కాసేపట్లో స్పష్టత వస్తుందన్నారు. చర్చలు జరుగుతున్నాయన్నారు. పొత్తు కుదరకుంటే 175 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. టిడిపి చివరి నిమిషంలో ఇలా ఆలోచించడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.