కాశ్మీర్, హైదరాబాద్: కవిత వ్యాఖ్యలపై పాక్ మీడియా
హైదరాబాద్: కాశ్మీర్, హైదరాబాద్లపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కాశ్మీర్, హైదరాబాద్లపై చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ మీడియాలో హల్చల్ సృష్టిస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలకు పాకిస్తాన్ మీడియా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలను ప్రచురించాయి.
పాకిస్తాన్కు చెందిన డైలీటైమ్స్ డాట్ కామ్ డాట్ పికె కవిత వ్యాఖ్యలపై ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. హైదరాబాద్, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కావని, బలవంతంగా ఢిల్లీ వాటిని అక్రమించుకుందని కవిత చెప్పినట్లు ఆ మీడియా రాసింది.
ఈ రెండు ప్రాంతాలు విడిగా ఉండేవని, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రెండు ప్రాంతాలను బలవంతంగా భారతదేశంలో విలీనం చేశారని కవిత అన్నట్లు ఆ మీడియా రాసింది. కాశ్మీర్పై మనం స్పష్టంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని, కొన్ని భాగాలు మనవి కావని, ఆ విషయాన్ని మనం అంగీకరించాలని, అంతర్జాతీయ సరిహద్దు రేఖలను తిరిగి నిర్వచించుకోవాలని ఆమె అన్నట్లు ఆ మీడియా రాసింది.
కవిత వ్యాఖ్యలను కాంగ్రెసు నాయకుడు అభిషేక్ సింఘ్వీ ఖండించిన విషయాన్ని కూడా ఆ మీడియా రాసింది. కాశ్మీర్ భారత్లో స్పష్టంగా అంతర్భాగమేనని, 1947 ఆక్సిసెషన్ ఇన్స్ట్రుమెంట్ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పిందని ఆయన అన్నట్లు రాసింది.
కవిత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూతురు అని పేర్కొంటూ కాశ్మీర్, తెలంగాణలపై కవిత చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెసు తీవ్రంగా ప్రతిస్పందించిందని ఆ మీడియా రాసింది.