రాజధాని.. ఖర్చు కష్టమే, ఇలా బెస్ట్: బాబుకి ప్రజెంటేషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణ కోసమే రూ.40వేల కోట్లు ఖర్చు అవుతుందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి ఇంత ఖర్చు కష్టమని, ప్రభుత్వ భూములను వాడుకోవడం మేలని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. ఏపీలో ఒక్కో ప్రాంతంలో అసెంబ్లీ, హైకోర్టు ఉండాలని తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీ పలు అంశాలను తెలిపింది.
రాజధానిని విజయవాడ - గుంటూరు (వీజీటీఎం) పరిధిలో ఏర్పాటు చేయాలనుకుంటే భూసేకరణకే 40వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు. ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.50 లక్షలు, మిగతా ప్రాంతాల్లో రూ.20 లక్షలు ఉందన్నారు. కొత్త భూసేకరణ చట్ట ప్రకారం రూ.50 లక్షల భూమికి రూ.2 కోట్ల పరిహారం చెల్లించవలసి ఉంటుందని అభిప్రాయపడింది. అందువల్ల ఇరవై వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలంటే కేవలం భూసేకరణకే పెద్ద మొత్తం అవుతుందని తెలిపింది.
ప్రయివేటు భూమి జోలికి పోకుండా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమితో రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. రాజధాని సమగ్రాభివృద్ధి కోసం రూ.1.2 లక్షల కోట్లు అవసరమన్నారు. కేంద్ర, రాష్ట్ర, ప్రయివేటు భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. చత్తీస్గఢ్కు రూ.778 కోట్లు, జార్ఖండ్కు రూ.200 కోట్లు, ఉత్తరాంఖండ్కు రూ.438 కోట్లు మాత్రమే ఆయా పంచవర్ష ప్రణాళికల కాలంలో కేంద్రం ఇచ్చిందన్నారు.
దీన్ని బట్టి ప్రణాళికా సంఘం ఇచ్చే మొత్తం రాష్ట్రాలు రాజధానికి లేదా రాష్ట్రంలోని వివిధ ప్రంతాల అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. అన్నింటిని పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ భూమే మేలని తెలిపింది. మధ్యలో ఉన్న ప్రాంతాన్నే రాజధానిగా ఎంపిక చేయాలన్న అంశం సబబుకాదని, అన్ని వ్యవస్థలను రాజధానిలో పెట్టే అవసరం కూడా లేదని పేర్కొంది. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు.. అన్ని ఒక్కో ప్రాంతంలో ఉండాలన్నారు.