వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ: తల్లి వెల్లడి
అనంతపురం: వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తాడని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫలా మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. పరిటాల కుటుంబం పేరుతో బెదిరింపులకు, అక్రమ వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె సోమవారంనాడు హెచ్చరించారు.
గత కొంత కాలంగా పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తాడని పరిటాల సునీత అన్నారు. అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి శ్రీరామ్కు ఇంకా కొంత సమయం అవసరమని చంద్రబాబు సూచించారు.
చంద్రబాబు సూచనతో పరిటాల శ్రీరామ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదని అప్పట్లో వార్తాకథనాలు వచ్చాయి. అయితే, పరిటాల శ్రీరామ్ తన తండ్రి పరిటాల రవి పేరు మీద సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
చాలా కాలంగా శ్రీరామ్ రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ యువకులతో కొత్త టీమ్ను ఏర్పాటు చేస్తున్నారని, ఆ టీమ్లో శ్రీరామ్ కూడా ఉన్నాడని వార్తలు వచ్చాయి.