మోడీ సాక్షిగా దూరం: బాబుపై కోపం తగ్గని పవన్కళ్యాణ్
హైదరాబాద్: తన మిత్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్కు విజయవాడ పార్లమెంటు స్థానాన్ని కేటాయించక పోవడంపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుపై ఆగ్రహంతో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు. హైదరాబాదులోని నరేంద్ర మోడీ బహిరంగ సభలో పవన్, బాబుల మధ్య పొరపొచ్చాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపించిందంటున్నారు.
నిజామాబాద్, హైదరాబాద్ సభల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్... మోడీ పైన ప్రశంసలు కురిపించారు. కానీ చంద్రబాబు పేరు ఎత్తలేదు. హైదరాబాదు సభలో ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లుగా కనిపించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులు మొదటిసారి నరేంద్ర మోడీ సభలో హైదరాబాదులో వేదికను పంచుకున్నారు.
వేదిక పంచుకున్నప్పటికీ చంద్రబాబు పట్ల పవన్ అసహనంతో ఉన్నట్లుగా ఆయన తీరును చూస్తే అర్థమవుతోంది. విజయవాడ లోకసభ స్థానాన్ని పొట్లూరికి ఇవ్వనందుకే పవన్ టిడిపి అధినేత పట్ల అసహనంతో ఉన్నారని అంటున్నారు.
నిజామాబాద్, హైదరాబాదు సభల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్... మోడీకి మద్దతిస్తూ బిజెపికి ఓటేయాలని సూచించారు. కానీ టిడిపికి ఓటేయాలని ఇరు సభల్లో ఎక్కడా చెప్పలేదు. తన ప్రసంగంలో చంద్రబాబును ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే, చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాదులో ప్రసంగం ప్రారంభంలో మాత్రమే పవన్ పేరును ప్రస్తావించారు.