గ్రేటర్పై లోకేష్ స్కెచ్: పవన్ కలుస్తారా, బిజేపీతో సిద్ధమా
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారట. పార్టీకి సింబల్ రాగానే ఆయన పూర్తిగా నిర్మాణం పైన దృష్టి సారించనున్నారట. అయితే, ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు చర్చనీయాంశమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు పలికిన పవన్.. ఆ పార్టీలతో కలిసి వెళ్తారా లేక ఒంటరిగా వెళ్తారా అలా కాకుండా ఏదో ఒక పార్టీతో కలిసి వెళ్లే ప్రయత్నాలు చేస్తారా అనే చర్చ సాగుతోంది.
ఇప్పటికే ఆయా పార్టీలు జీహెచ్ఎంసీ ఎన్నికల పైన దృష్టి సారించాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, మజ్లిస్ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తుండగా.. కాంగ్రెసు పార్టీ ఒంటరిగా పోరు చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ పెట్టుకున్న టీడీపీ, బీజేపీలు కలిసి బరిలోకి దిగుతాయా లేదా అనేది సస్పెన్స్గా మారింది. తెలంగాణ బీజేపీ నేతలు టీడీపీతో పొత్తును సార్వత్రిక ఎన్నికలకు ముందే వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా వ్యతిరేకించే అవకాశమెంతుందో.. పొత్తు కోరే అవకాశం అంతే ఉందంటున్నారు.
టీడీపీ, బీజేపీలు అధికారంలో లేకముందు జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వారికి మద్దతు పలికారు. ఇప్పుడు వారి పాలనను బేరీజు వేసుకొని ఆ పార్టీలకు మద్దతు పలుకుతారా అనే చర్చ సాగుతోంది. పవన్ ఆ పార్టీలతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తే వారి పాలన బాగున్నట్లుగా భావిస్తున్నట్లేనని లేదంటే, అసంతృప్తితో ఉన్నట్లుగానే భావించవచ్చునని చెబుతున్నారు. టీడీపీ, బీజేపీలతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తానని పవన్ సార్వత్రిక ఎన్నికలకు ముందు చెప్పారు.
ఇప్పుడు ఆ పార్టీలు అధికారంలో ఉన్నాయి. దీనిని పరిగణలోకి తీసుకొని ఆయన పొత్తు పెట్టుకోవచ్చునని అంటున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. మరోవైపు చంద్రబాబు పాలనలో బీజీగా ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ పైన దృష్టి పెడుతున్నారట. అయితే, ఆయన తనయుడు నారా లోకేష్ వీటి పైన ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట.