తగ్గిన పవన్: టిడిపి పొత్తు రగడతో పొట్లూరి బిజెపి ట్విస్ట్!
హైదరాబాద్: విజయవాడ టిక్కెట్ గొడవ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏడు లోకసభ స్థానాల్లో అభ్యర్థులను స్వతంత్రంగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు పవన్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
గురువారం ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ గురువారం పవన్ కళ్యాణ్ను కలిశారు. ఈ సమయంలో పోటీకి దూరంగా ఉండాలని పవన్ ఆయనకు నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, పొట్లూరి వర ప్రసాద్ శనివారం నాడు తన నిర్ణయాన్ని తెలిపే అవకాశముంది. ఎల్లుండి నామినేషన్కు చివరి తేది.
కొత్త ట్విస్ట్
పొట్లూరి వర ప్రసాద్ పోటీ విషయమై కొత్త ప్రచారం వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం, బిజెపిల మధ్య అభ్యర్థుల రగడ రాజుకున్న విషయం తెలిసిందే. నర్సాపురం, విశాఖ తదితర లోకసభ స్థానాల్లో బిజెపి బలమైన అభ్యర్థులను నిలబెట్టలేదని టిడిపి ఆరోపిస్తోంది. పొత్తు ద్వారా బిజెపికి లేదా టిడిపికి లబ్ధి చేకూరాలి తప్ప మరో పార్టీకి లబ్ధి చేకూరవద్దని టిడిపి చెబుతోంది.
ఈ నేపథ్యంలో బిజెపి, టిడిపిల పొత్తు చివరి నిమిషంలో ఏమైనా కావొచ్చుననే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కూడా బిజెపితో పొత్తుకు కటీఫ్ చెబుతామనే ఆలోచనలో ఉన్నారంటున్నారు. అదే జరిగితే... పొట్లూరి బిజెపి తరఫున విజయవాడ లోకసభ స్థానానికి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. బిజెపి, టిడిపి పొత్తు ఉత్కంఠకు ఈ రోజు లేదా రేపు తెర పడనుంది. ఆ తర్వాత పొట్లూరి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.