ఈ ఐదు రాష్ట్రాలపై కన్ను, పవన్ కళ్యాణ్ 'ప్రత్యక్షం'!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రాల పైన దృష్టి సారిస్తున్నట్లుగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్నాటకలో తన పార్టీకి అవకాశం ఉందని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ, కర్నాటకలతో పాటు ఒడిశా, తమిళనాడు పైన దృష్టి సారిస్తున్నారట.
జనసేన పార్టీ నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే పవన్ తన పార్టీ గుర్తుగా పిడికిలిని ఎంచుకున్నారని, ఆ వివరాలను ఆగస్ట్ 15న ప్రెస్మీట్లో చెబుతారంటున్నారు. తాజాగా మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సూచనలు, సలహాలతో ఆయన ప్రియమిత్రుడు, ఫ్రముఖ ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి పార్టీ సింబల్ 'పిడికిలి'ని ఆకర్షణీయంగా డిజైన్ చేస్తున్నారట.
అలాగే జనసేన పార్టీ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన రాజు రవితేజ్కు పార్టీ కోర్ కమిటీ ఏర్పాటు బాధ్యతలు అప్పజెప్పారట. జనసేన పార్టీని కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేయాలనుకోవడం లేదంట.
ఈ రెండు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో జనసేన పార్టీని ముందుకు తీసుకు వెళ్లనున్నారట. ఈ క్రమంలో ఈ ఐదు రాష్ట్రాల్లో పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచేందుకు పవన్ కళ్యాణ్ అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నారట. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసి ఎలక్షన్ల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్లుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.