చిరు ఔట్, రేసులో పవన్కళ్యాణ్, షర్మిల: గెలిపించేదెవరు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఆయా పార్టీల తరఫున ప్రముఖులు జోరుగా ప్రచారం చేశారు. రేపటి ఫలితాలతో వారి వారి ప్రచారం ఏ పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడిందో తెలిసే అవకాశముంది.
తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల తరఫున ప్రముఖులు పాల్గొన్నారు. టిడిపి, బిజెపి కూటమికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలంగాణ, సీమాంధ్రల్లో ప్రచారం నిర్వహించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి షర్మిల ప్రచారం చేయగా, తెలంగాణలో ఆరెల్డీ తరఫున ప్రముఖ సినీ నటి జయప్రద ప్రచారం చేశారు. వీరి ప్రయత్నం ఏ మేరకు ఉపయోగపడిందో రేపు తేలనుంది.
పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున తెలంగాణలో, సీమాంధ్రలో ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి మంచి స్పందన లభించింది. పవన్ ప్రచారం తమకు బాగా ఉపయోగపడుతుందని టిడిపి, బిజెపిలు చెబుతున్నాయి.
షర్మిల
వైయస్ జగన్ సోదరి షర్మిల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున సీమాంధ్ర, తెలంగాణల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఒకవిధంగా జగన్, విజయమ్మల కంటే ఆమె ప్రచారానికే ఆదరణ ఎక్కువ కనిపించిందని చెప్పవచ్చు.
చిరంజీవి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కాంగ్రెసు పార్టీ తరఫున సీమాంధ్రలో ప్రచారం నిర్వహించారు. అయితే ఆయన ప్రచారానికి ఆశించిన స్పందన రాలేదు. సీమాంధ్రలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మధ్య పోటాపోటీ ఉండగా, కాంగ్రెసు పార్టీ ఎక్కడా రేసులో లేదనే చెప్పవచ్చు. చిరంజీవి ప్రచారం ఎంత వరకు లాభించిందే తెలియనుంది.
జయప్రద
ప్రముఖ నటి, రాష్ట్రీయ లోకదళ్ నాయకురాలు జయప్రద తెలంగాణ ప్రాంతంలో టిఆర్ఎల్డీ తరఫున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెసు పార్టీకి కూడా మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
నరేంద్ర మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సీమాంధ్ర, తెలంగాణల్లో పర్యటించి ఆ పార్టీల్లో కొత్త ఉత్సాహం నింపారు.
రాహుల్, సోనియా
తెలంగాణలో కాంగ్రెసు పార్టీ తరఫున ఎవరు స్టార్ కంపెయినర్లు లేరు. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు.