బెజవాడ సెంట్రల్పై బిజెపి-టిడిపి : పవన్ చొరవతో డీల్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్ శాసన సభ నియోజకవర్గం బదులుగా విజయవాడ పశ్చిమ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకునేందుకు అంగీకరించేలా చూడటంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారట.
టిడిపి - బిజెపి పొత్తులో భాగంగా తొలుత విజయవాడ సెంట్రల్ శాసన సభ నియోజకవర్గం కమలం పార్టీకి వచ్చింది. దీనిపై టిడిపి నియోజకవర్గం ఇంఛార్జి బొండా ఉమామహేశ్వర రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బిజెపికి ఏమాత్రం పట్టు లేదని, దీనిని ఆ పార్టీకి ఇస్తే అక్కడ ఓడిపోవడమే కాకుండా పక్క నియోజకవర్గాల పైన ప్రభావం పడుతుందని బొండా ఉమ అధిష్టానానికి చెప్పారు.
సెంట్రల్ నియోజకవర్గాన్ని బిజెపికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దని, తాను పోటీ చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ బదులు విజయవాడ పశ్చిమను తీసుకోవాలని టిడిపి ఆఫర్ చేసింది. దీనికి బిజెపి తొలుత ససేమీరా అన్నదని సమాచారం. అయితే, పవన్ చొరవవల్ల బిజెపి ఆ స్థానాన్ని తీసుకునేందుకు అంగీకరించిందంటున్నారు.
ఈ విషయాన్ని బొండా ఉమామహేశ్వర రావు, స్థానిక టిడిపి నేతలు పవన్ దృష్టికి తీసుకు వెళ్లారట. అక్కడ టిడిపి అభ్యర్థి అయితేనే గెలుస్తుందని చెప్పారట. దీంతో బిజెపి నాయకులతో పవన్ మాట్లాడారట. కాగా, విజయవాడ పశ్చిమ నుండి సోమవారం కాంగ్రెసు పార్టీలో చేరిన వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేసే అవకాశముంది.