టార్గెట్ చిరు, జగన్: పవన్ కళ్యాణ్కు దాసరి తోడయ్యారా!
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచార బరిలో దిగితే ఆయన టార్గెట్ ముఖ్యంగా ఇద్దరు ఉన్నారంటున్నారు. ఆయన సోదరుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఉన్న కాంగ్రెసు పార్టీతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పవన్ ప్రధాన టార్గెట్ అంటున్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి ఇప్పటికే ఆ విషయం అర్థమైంది.
బిజెపి తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా అంటే అనుమానంగానే కనిపిస్తోంది. అయితే, ఇప్పటికే బిజెపికి, దేశాన్ని ముందుకు నడిపించే సత్తా కలిగిన నరేంద్ర మోడీకి ఓటు వేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఆయన ప్రచారం చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, ఆయన ప్రచారం చేయవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ ప్రచార పర్వంలోకి దిగితే మాత్రం కాంగ్రెసు పార్టీని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని చీల్చి చెండాడుతారంటున్నారు.
పవన్ కళ్యాణ్ కాంగ్రెసు పార్టీకి బద్ద వ్యతిరేకి అనే విషయం తెలిసిందే. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు.. 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కాంగ్రెసు నేతల పైన విరుచుకు పడ్డారు. చిరంజీవి కాంగ్రెసు పార్టీలో చేరడాన్ని జీర్ణించుకోలేని పవన్.. జనసేన పార్టీని స్థాపించి.. బిజెపికి మద్దతు పలికారు. ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీని టార్గెట్ చేసుకోవడానికి కారణముందంటున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు తనను బెదిరించారని పవన్ చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ సినిమా అంగీకరించమని కొందరు వ్యక్తుల ద్వారా బెదిరింపులు వచ్చాయని పవన్ చెప్పారు. నాటి వైయస్ బెదిరింపులను పవన్ జీర్ణించుకోలేకపోతున్నారట. వైయస్ మీది ఆగ్రహంతో పాటు పలు కారణాల వల్ల పవన్కు జగన్ మరో టార్గెట్ అయ్యారని అంటున్నారు.
దాసరి తోడయ్యారా?
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా పని చేస్తున్నారు. తద్వారా పవన్ తన సోదరుడు చిరంజీవిని పరోక్షంగా టార్గెట్ చేసుకున్నాడనే భావించవచ్చు. అయితే, ఇప్పుడు పవన్కు దర్శకరత్న దాసరి నారాయణ రావు తోడయ్యారా అనే చర్చ సాగుతోంది. శుక్రవారం ఓ కార్యక్రమంలో దాసరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రాజకీయ బ్రోకర్ వల్ల రాష్ట్ర విభజన జరిగిందని, కొంత టైం తీసుకొని తాను ఆయన ఎవరో చెబుతానని వ్యాఖ్యానించారు.
మొన్నటి వరకు కాంగ్రెసు పార్టీలో ఉన్న దాసరికి, తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన చిరుకు పడదనే విషయం తెలిసిందే. పిఆర్పీని చిరు కాంగ్రెసులో విలీనం చేయడం, తనను మరోసారి రాజ్యసభకు పంపించక పోవడాన్ని దాసరి జీర్ణించుకోలేక ఆ పార్టీకి దూరం జరిగారు. ఆయన పరోక్షంగా చిరును ఉద్దేశించి పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాంగ్రెసు పార్టీ నేతృత్వంలోని యూపిఏ విభజన చేయడం, చిరు కేంద్రమంత్రిగా ఉండటం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు మెగాస్టార్నేనా అనే చర్చ సాగుతోంది.