జయ: 'జగన్కి ఎంత శిక్ష పడుతుందో, నిద్రలేని రాత్రులే'
హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత రూ.66 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ నమోదైన ఒక ఛార్జీషీటుతోనే ఆమెకు న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తే.. ఇప్పటికే 11 ఛార్జీషీట్లు, రూ.44వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు కేసులు నమోదైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత శిక్ష పడుతుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు.
భవిష్యత్తును తలుచుకుంటే జగన్ ఇక నిద్రలేని రాత్రులు గడపాల్సిందేనని పయ్యావుల ఎద్దేవా చేశారు. ఆయన దొంగ నమస్కారాలకు ఫలితం ఉండబోదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడితే కోర్టులు ఉపేక్షించవన్నారు. ఇదే జయలలిత కేసు చెబుతోందన్నారు.
ఈ తీర్పు దేశ రాజకీయాల పైన అపారమైన ప్రభావం చూపబోతుందన్నారు. ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం జయలలిత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారని, భవిష్యత్తులో జగన్ పరిస్థితీ ఇంతే అన్నారు.
అవినీతి సొమ్ముతో పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి పత్రిక, సాక్షి చానల్ పరిస్థితి ఏమవుతుందో అన్నారు. ఎన్నికల సంస్కరణలు చేపడుతున్న నేపథ్యంలో వైసీపీ ఏర్పాటైన వ్యవహారాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాలను వైయస్ నేరమయం చేస్తే, జగన్ రాజకీయాల్ని అవినీతిమయం చేశారన్నారు.