రెచ్చగొట్టొద్దు: కేసీఆర్పై మెట్టు దిగిన బాబు (పిక్చర్స్)
హైదరాబాద్: ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ మెట్టు దిగారు. విద్యార్థుల ఫీజులను 58 శాతం తాము భరిస్తామని, 42 శాతం తెలంగాణ రాష్ట్రం భరించాలనే కొత్త ప్రతిపాదన చేశారు. గురువారం ఆయన ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన స్పందించారు. విభజన చట్టం ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో పదేళ్లు ఉమ్మడిగానే అడ్మిషన్లు నిర్వహించాలని, అందువల్ల ఫీజుల పథకాన్నీ ఉమ్మడిగానే అమలు చేద్దామన్నారు.
జనాభా ప్రాతిపదికన మొత్తం ఖర్చులో తాము 58 శాతం భరిస్తామని, తెలంగాణ 42 భరించాలన్నారు. తన సరికొత్త ప్రతిపాదనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు రాష్ట్రాల వారిమి పంచుకుందామని, రెచ్చగొట్టే ధోరణి వద్దన్నారు. 1956లో హైదరాబాద్ జనాభా పది లక్షలని, ఇప్పుడు కోటీ పది లక్షలని, దాంతో ఎలా పోల్చుకుంటామన్నారు.
చర్చించి పరిష్కరించేందుకు తాను సిద్ధమని, మీరు రావాలన్నారు. పాకిస్తాన్లా వైరాలకు పోకుండా.. కలిసి ముందుకు పోదామన్నారు. ఇక్కడ ఉన్న వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పిన వారు... ఇప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్రంతో సంప్రదించే సమయంలో తెలంగాణకు నష్టం రాకుండా చూడాలని తాను కోరానని చెప్పారు. తెలుగు ప్రజల కోసం తాను ఓ మెట్టు కిందకు దిగేందుకు సిద్ధమన్నారు.
చంద్రబాబు
రాజకీయాల్లో పోటీ పడినా, ప్రజా సంక్షేమ కార్యక్రమాల విషయంలో అవగాహనతో సాగుదామని చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్తో కలిసి గురువారం మానవ వనరులపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫీజులు, స్థానికత, అడ్మిషన్ల అంశాన్ని ప్రస్తావించారు.
చంద్రబాబు
ఎంసెట్ అడ్మిషన్లు సకాలంలో నిర్వహించకపోతే నష్టపోయేది తెలుగు విద్యార్థులే అన్నారు. గత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ సరిగా ఇవ్వక, సకాలంలో అడ్మిషన్లు నిర్వహించక విద్యార్థులు ఇతర రాషా్ట్రలకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని, రెండు మూడు రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ అడ్మిషన్లను వివాదం చేస్తోందన్నారు. కొన్ని సందర్భాల్లో కుటుంబాలు కూడా విడిపోతాయని, విడిపోయాకా కొందరు అనోన్యంగా ఉంటారన్నారు. మరికొందరు విద్వేషాలతో ఉంటారని, విద్వేషాలు ఎవరికీ మంచిది కాదన్నారు.
చంద్రబాబు
స్థానికతను 1956ను ప్రామాణికంగా నిర్ణయించడంలో హేతుబద్ధతను చంద్రబాబు ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటకతోసహా ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని, 50 ఏళ్ల కిందట భద్రాచలం ఎక్కడుంది? వారికి స్థానికత సర్టిఫికెట్ ఎలా ఇస్తారు? 1956లో హైదరాబాద్లో కేవలం 11 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు కోటీ 10 లక్షల మంది ఉన్నారు. వారంతా పన్నులు చెల్లించడంలేదా? వారి సంక్షేమం అక్కరలేదా? అని నిలదీశారు. హైదరాబాద్కున్న ఇమేజ్పోతే నష్టపోయేది తెలంగాణ ప్రజలేనన్నారు.
చంద్రబాబు
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎంసెట్ అడ్మిషన్లు పూర్తి కావాలని, దీనిపై కలిసి కూర్చుని మాట్లాడుకుందామని బాబు పిలుపునిచ్చారు. సుప్రీం చెప్పినా, కేంద్రం చెప్పినా విననంటే కుదరదని, ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంటుందన్నారు. మనం హద్దులో మనం లేనప్పుడు సుప్రీంకోర్టు అథారిటీ నిర్ణయం తీసుకుంటుందని, రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం తీర్పు ఇస్తుందని, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఉందన్నారు.
చంద్రబాబు
ఈ చట్టానికి ఒప్పుకొనే కేసీఆర్ కుటుంబ సమేతంగా(సోనియాతో) ఫోటోలు దిగారని, ఇవేమీ సామ్రాజ్యాలు కావన్నారు. పాకిస్థాన్, ఇండియాలాగా ఉండటం సరికాదన్నారు. విద్యుత్ సమస్యలపై తమిళనాడు, కర్ణాటకలతో సహకరించుకోవడంలేదా? అని ప్రశ్నించారు. కూర్చుని మాట్లాడుకుందామని తెలంగాణ సీఎంకి లేఖ రాశానని, ఇప్పుడూ రాస్తానని చెప్పారు. విద్యార్థులు, ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే ఒక అడుగు వెనక్కి తగ్గడానికీ సిద్ధమన్నారు.