రిజైన్: ఏడ్చిన తుమ్మల, వందమంది: బాబు (పిక్చర్స్)
హైదరాబాద్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు తుమ్మల తన రాజీనామా లేఖను పంపారు. శనివారం జిల్లా క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన తుమ్మల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖపై సంతకం చేస్తున్న సమయంలో తుమ్మల కన్నీటి పర్యంతమయ్యారు.
తుమ్మలతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వర రావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, జెడ్పీ చైర్పర్సన్ కవిత, జెడ్పీ వైస్ చైర్మన్ వాసుదేవరావు కూడా రాజీనామా చేశారు. సెప్టెంబర్ 5న తుమ్మల తెరాసలో చేరనున్నారని తెలుస్తోంది.
కాగా, శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో తుమ్మల సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి పదవి విషయంపై తుమ్మలకు కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందు మంత్రిగా తుమ్మల నాగేశ్వర రావు ప్రమాణస్వీకారం చేయవచ్చుననే ప్రచారం జరుగుతోంది.
తుమ్మల నాగేశ్వర రావు
పార్టీ మారేదీ లేనిదీ వచ్చే నెల 5వ తేదీన చెప్తానని ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. ఖమ్మం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆయన శనివారంనాడు వచ్చారు. అలా అంటూనే ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ లేఖ రాశారు. టిడిపికి రాజీనామా చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై ఆయన కంటతడి పెట్టారు.
తుమ్మల నాగేశ్వర రావు
టిడిపి జిల్లా అధ్యక్షుడు కొండబాల, జడ్పీ చైర్పర్సన్ కవిత కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ బలసాని తదితరులు కూడా పార్టీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తుమ్మల నాగేశ్వర రావు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పంపించారు. నేను పార్టీకి రాజీనామా చేస్తున్నానను అని ఏకవాక్యంతో ఆయన తన రాజీనామా లేఖను పంపించారు.
తెలుగుదేశం
తుమ్మల పార్టీని వీడుతారని ఊహించిందేనని టీడీపీ నేతలు పేర్కొన్నారు. రాజకీయాల్లో లాభనష్టాలు చూసుకోవడం తగదని, ఏ పార్టీలో అయినా గ్రూపులు సహజమని నేతలు అన్నారు. తుమ్మల టీడీపీని వీడడం సరికాదని నర్సారెడ్డి అన్నారు. రాజకీయాల్లో ఒక్కొసారి లాభం ఉండవచ్చు... నష్టం ఉంటుందని అన్నారు. పార్టీ అధికారంలో ఉండవచ్చు, ఉండకపోవచ్చునని అంతమాత్రాన పార్టీని వీడటం సరికాదన్నారు.
నర్సారెడ్డి
ఇప్పుడు తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోవచ్చు.. వచ్చే ఐదేళ్లలో భవిష్యత్ ఏమిటన్నది చెప్పలేమని... 30 ఏళ్ల రాజకీయజీవితంలో ఉన్న తుమ్మల మంచి నాయకుడు, మంచి వక్త అని, అయితే ఆయన పార్టీ మారడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోవచ్చునని నర్సారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో తుమ్మలకు టీడీపీ పెద్ద పీట వేసిందని ఆయన చెప్పారు.
చంద్రబాబు నాయుడు
తుమ్మల పార్టీ వీడటంపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ఒక్కరు పార్టీని వీడితే వందమంది నేతలను తయారు చేస్తామని చంద్రబాబు అన్నారు.