టీసీ టిక్కెట్ అడిగితే మహిళలే దాడి చేశారు (పిక్చర్స్)
హైదరాబాద్: బేగంపేట దగ్గర ఎంఎంటీఎస్ రైలులో టికెట్ కలెక్టర్ (టీసీ) కౌసల్యపై దుండగులు దాడి చేశారు. టికెట్ అడిగినందుకు టీసీపై దుండగులు దాడికి పాల్పడ్డారు. టీసీ ఫిర్యాదు మేరకు బేగంపేట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తీవ్రంగా గాయపడిన కౌసల్యను లాలాపేట ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల్లో మహిళా టీసీపై దాడి జరగడం రెండోసారి.ఎంఎంటీఎస్లో తమకు రక్షణ కరువైందని మహిళా టీసీలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎంఎంటీఎస్ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఎంఎంటీఎస్ స్టేషన్లలో గానీ, రైళ్లలో గానీ తనిఖీలు చాలా అరుదుగా జరుగుతుండేవి. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్ లేకుండా ప్రయాణించడానికి అలవాటు పడిపోయారు. ఈ విషయాన్ని గ్రహించిన రైల్వే అధికారులు టీటీఈ, టీటీఐలకు టార్గెట్లు ఇవ్వడం మొదలుపెట్టారు.
టికెట్ లేకుండా ప్రయాణికుల నుంచి నెలకు లక్షన్నర రూపాయలను జరిమానాగా వసూలు చేయాలని టార్గెట్లు ఇవ్వడంతో టీటీఈ, టీటీఐలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. సికింద్రాబాద్ డివిజన్లో మొత్తం 532 మంది టీటీఈ, టీటీఐలకు గాను ప్రస్తుతం 382 మంది మాత్రమే ఉన్నారు. వారిలో 63 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. ఒకప్పుడు ఒక టీటీఈ, టీటీఐ రెండు, మూడు బోగీలను తనిఖీ చేసేవారు. సిబ్బంది కొరత కారణంగా ఇప్పుడు ఒక్కొక్కరు ఐదు నుంచి ఆరు బోగీలను తనిఖీ చేయాల్సి వస్తోంది.
ఒక్కొక్కరే తనిఖీలకు వెళ్తుండడంతో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. టికెట్ అడిగితే దాడికి దిగుతున్నారు. టికెట్ లేని ప్రయాణాలు ముందు నుంచీ ఉన్నప్పటికీ ఆ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. నాడు జరిమానాలకు సంబంధించి పెద్దగా టార్గెట్లు లేకపోవడంతో టికెట్ లేని ప్రయాణికులను టీటీఈలు గానీ, టీటీఐలు గానీ చూసీ చూడనట్టు వదిలేసేవారు. ఒకవేళ జరిమానా విధించినా అది అంతంత మాత్రంగానే ఉండేది.
టీసీపై దాడి
టికెట్ లేకుండా ప్రయాణించడంతోపాటు ప్రశ్నించిన టిటిఇపై దాడికి పాల్పడిన ప్రయాణికులపై దక్షిణ మధ్య రైల్వే జిఆర్పి పోలీసులు కేసును నమోదు చేశారు.
టీసీపై దాడి
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. బుధవారం ఉదయం పలక్నుమా-లింగంపల్లి ఎంఎంటిఎస్ (నెంబర్ 47150)లో కొంత మంది గ్యాంగ్గా ఉన్న ప్రయాణికులు ఎలాంటి టికెట్ లేకుండా ప్రయాణం సాగిస్తున్నారు.
టీసీపై దాడి
ఇంతలో సికింద్రాబాద్ డివిజన్కు చెందిన టిటిఇ సదరు ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని గ్రహించి ఫైన్ కట్టాలని అడగడంతో రెచ్చిపోయిన టికెట్లేని ప్రయాణికులు టిటిఇ కౌసల్యపై దాడికి పాల్పడ్డారు. దీంతో కౌసల్య స్వల్పంగా గాయపడింది.
టీసీపై దాడి
ఈ సంఘటన బేగంపేట్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం మేరకు జిఆర్పి పోలీసులు వచ్చి ఒకరిద్దరిని అదుపులోకి తీసుకుని కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
టీసీపై దాడి
గాయాలపాలైన టిటిఇ కౌసల్యను ఆసుపత్రికి తరలించారు. ఇదిలాఉండగా విచారణ జరుపుతున్న పోలీసులు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తారని తెలిపారు.
టీసీపై దాడి
రైల్వే అధికారులు ఈ సంఘనపై స్పందిస్తూ టికెట్లేకుండా ప్రయాణం చేయడం నేరమని, అందులో టికెట్ లేకుండా ప్రయాణించడమే కాకుండా రైల్వేసిబ్బందిపై దాడికి పాల్పడం దారుణమని, రైల్వే విధులకు ఆటంకం కలిగిస్తే సెక్షన్ 146 రైల్వేయాక్ట్ 1989 ప్రకారం ఆరునెలల జైలుశిక్ష, వెయ్యిరూపాయల జరిమానా ఉంటుందని, ఒక్కోసారి రెండు విధించే అవకాశం ఉందని అన్నారు.
టీసీపై దాడి
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి రైల్వే సిబ్బంది నిర్వహిస్తున్న విధులకు ప్రయాణికులు సహకరించి తమ టికెట్ను చూపించాలని అన్నారు.
టీసీపై దాడి
రైల్వేలో అక్రమంగా ప్రయాణిస్తూ రైల్వేకు నష్టం కలిగించడంతో పాటు నిజమైన ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపట్ల రైల్వేచెకింగ్ సిబ్బంది నిరంతరం నిఘాతోపాటు తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు.
టీసీపై దాడి
కాగా, టిక్కెట్ కలెక్టర్ కౌసల్య పైన దాడికి పాల్పడిన వారు మహిళలే కావడం గమనార్హం. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరు తప్పించుకున్నారు. మరోవైపు, రైళ్లలో తమకు రక్షణ కరువైందని టీసీలు రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.