తీరొక్క బతుకమ్మ: పాడుతూ ఆడిన కవిత (పిక్చర్స్)
మహబూబ్నగర్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో బుధవారం రాత్రి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి మహిళా సమాఖ్య సభ్యులు పోటీపడి అందమైన బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు. మైదానంలో బృందాల వారిగా బతుకమ్మలను ఉంచి ఆడి పాడారు. బతుకమ్మ, కోలాటాలు, దాండియా, గిరిజన నృత్యాలతో హోరెత్తించారు.
అదే సమయంలో తెలంగాణ చౌరస్తా నుంచి ప్రదర్శనగా జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి జాగృతి అధ్యక్షురాలు కవిత అక్కడికి చేరుకున్నారు. ఆమెకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టర్ జీడీ ప్రియదర్శిని కవితకు అభివాదం చేశారు. జాగృతి అధ్యక్షురాలు కవిత పాడిన పాటలు వేడుకలకు ఊపునిచ్చాయి.
మహిళా బృందాలతో కలిసి కోలాటం వేసి సందడి చేశారు. దాండియా ఆడి అబ్బురపరిచారు. జిల్లా ఎమ్మెల్యేలు ఆమెతో కలిసి ఆడి పాడారు. సంబురాలకు జిల్లా నలుమూలల నుంచి మహిళలు వందలాది బతుకమ్మలతో తరలివచ్చారు. కొందరు బారీ బతుకమ్మలను అడవి పూలతో అలంకరించి తీసుకువచ్చారు. అవి ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. బతుకమ్మలో పొదిగిన అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన 20 మంది డోలు కళాకారుల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. లయబద్దంగా డోలు వాయిస్తూ ర్యాలీకి కొత్త ఊపునిచ్చారు.
కవితకు స్వాగతం
అచ్చంపేట ప్రాంతానికి చెందిన గిరిజన మహిళలు కోలాటంతో ఆకట్టుకున్నారు. తెలంగాణ చౌరస్తా వద్ద కోలాటం వేస్తూ ఎంపీ కవితకు స్వాగతం పలికారు. దాదాపు 50 మంది ఏకరూప దుస్తులు ధరించి కోలాటం వేస్తూ, బతుకమ్మ పాటలకు అడుగు కదుపుతూ ఆకట్టుకున్నారు.
ఆడుతూ పాడుతూ..
పల్లెటూరి మహిళలతో పోటీ పడుతూ కల్వకుంట్ల బతుకమ్మ ఆడడంతో, ఆమె వేగాన్ని అందుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. గిరిజన నృత్యం చేస్తున్న మహిళలతో జత కలిసి, వారితో ఆడి పాడారు.
ఉర్రూతలూగించిన యువ ఎమ్మెల్యేలు
వేలాది మంది ప్రేక్షకుల నడుమ.. వందలాది మంది మహిళలు ఉత్సాహంగా బతుకమ్మలాడుతుండగా, జిల్లా యువ ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజు వారితో కలిసి ఆడి పాడారు. మొదట తడబడ్డా, తర్వాత మహిళలతో పోటీపడుతూ బతుకమ్మ ఆడారు.
నృత్యం చేశారు...
కోలాటాలు వేస్తూ ఉత్సాహంగా కవిత నృత్యం చేశారు. సీనియర్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, నాయకులు నిరంజన్రెడ్డి, విఠల్రావుఆర్యా, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ సైతం వారితో కలిసి పోటీ పడ్డారు. మహిళా బృందాలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు.
అప్పుడే దీపావళి వచ్చినట్లు..
బతుకమ్మ సంబురాల్లో టపాసుల మోత మోగింది. అప్పుడే దీపావళి వచ్చిందా అన్నట్లుగా బాణసంచా కాలుస్తూ యువకులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. జాగృతి అధ్యక్షురాలు కవిత, తెలంగాణ కూడలికి చేరుకోగానే మొదలైన టపాసుల మోత జెడ్పీ మైదానంలో బతుకమ్మ సంబరాలు పూర్తయ్యే వరకు కొనసాగింది.
అన్నా నన్నాడనివ్వండే..
జిల్లా పరిషత్ మైదానంలో మహిళా బృందాల వద్దకు జాగృతి అధ్యక్షురాలు కవిత వెళ్లి వారితో ఆడుతుండగా ఎమ్మెల్యేలంతా ఆమె వెంట నడిచారు. దీంతో రద్దీ ఎక్కువ కావడంతో బతుకమ్మ ఆడడం మహిళలకు, ముఖ్యంగా కవితకు ఇబ్బందిగా మారింది.