లష్కర్ తీన్మార్: స్వర్ణలత రంగం, అంబారీ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ పండుగ బోనాలు హంగామాతో సోమవారం ముగిసింది. భవిష్యత్ గురించి వివరిస్తూ ఉత్కంఠగా స్వర్ణలత 'రంగం' సాగింది. బలి హారం, పోతరాజుల విన్యాసాలు, ఘటం, అంబారీ ఊరేగింపు, భక్తుల కోలాటాలు, కళాకారుల ప్రదర్శనలు, నాయకుల నృత్యాలు, డప్పు దరువులు, భక్తుల కోలాహలం మధ్య లష్కర్ ఉజ్జయినీ మహాకాళి బోనాల జాతర ముగిసింది.
బోనాల ముగింపు వేడుకలను చూసి తరించేందుకు, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు తరలివచ్చిన భక్తులతో రెండో రోజు సోమవారం కూడా ఆలయం కిటకిటలాడింది. 'అమ్మా... బైలెల్లినాదో ' అంటూ హోరెత్తిన మైకులు, భక్తుల ఆటపాటలతో లష్కర్ (సికింద్రాబాద్) పురవీధులు హోరెత్తాయి.
జాతరకు 12 లక్షల వరకు భక్తులు తరలివచ్చారని, బోనాల పండుగ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి అశోక్కుమార్గౌడ్, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు.
స్వర్ణలత భవిష్యవాణి
లష్కర్ బోనాల జాతరలో రెండోరోజు స్వర్ణలత భవిష్యవాణి వినిపించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులోభాగంగా సోమవారం ఉదయం ఒంటి నిండా పసుపు పూసుకుని, నుదుటిపై ఎర్రటి కుంకుమ ధరించి, వేపాకులు, తంబూరా చేత పట్టుకుని, మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ స్వర్ణలత అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
స్వర్ణలత భవిష్యవాణి
ఆ తర్వాత స్వర్ణలలత గర్భ గుడి ఎదురుగా ఉన్న మాతంగి ఆలయం ఎదుట గుంతలో ఏర్పాటు చేసిన పచ్చి కుండపై నిలబడి, అమ్మవారినే తదేకంగా చూస్తూ, ఆమెను ఆవహించుకుని భవిష్య వాణి వినిపించారు.
ప్రశ్నలకు సమాధానాలు
భక్తులు అడిగిన ప్రశ్నలకు స్వర్ణలత సమాధానమిచ్చారు. వర్షాలు కురవడం ఆలస్యమైనప్పటికీ ఈ ఏడు పుష్కలంగానే పడతాయని అభయమిచ్చారు. ఈ ఏడాది పూజాది కార్యక్రమాలు తనకు సంతృప్తి ఇచ్చాయని చెప్పారు.
భక్తితో పూజించాలి
ఉన్నదాంట్లోనే భక్తితో పూజించిన వారికి తన ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. తనకు చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టినా తన క్రోదానికి గురి కాకతప్పదని హెచ్చరించారు. ఎవరు చేసిన పనులకు వారే కర్మ అనుభవించవలసి ఉంటుందని స్వర్ణలత అన్నారు.
అంబారీ ఊరేగింపు
అందంగా అలంకరించిన అంబారీ (ఏనుగు)పై అమ్మవారి చిత్రపటాన్ని ఊరేగించారు. తొలుత ఆలయ నిర్వాహకులు వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ కొబ్బరి కాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అంబారీ ఊరేగింపు
ముందువరుసలో రెండు ఒంటెలు, తర్వాతి వరుసలో రెండు అశ్వాలు నడుస్తుండగా అంబారీపై అమ్మవారిని మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాల నడుమ ఘనంగా ఊరేగించారు.
అంబారీ ఊరేగింపు
ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం ఊరేగింపు లష్కర్ పుర వీధుల గుండా మెట్టుగూడ చేరుకుంది. అక్కడ ఘటం సమర్పించి తిరిగి మహాకాళి అమ్మవారి ఆలయాన్ని చేరుకుంది. ఈ ఘట్టంతో లష్కర్ బోనాల జాతర ముగిసింది.
పలహారపు బండ్లు
సోమవారం సాయంత్రం తర్వాత ప్రారంభమైన ఫలహారపు బండ్ల, తొట్టెల ఊరేగింపులు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఉజ్జయినీ మహాకాళి ఆలయానికి అనుబంధ ఆలయాలై సోమసుందరం వీధిలోని శ్రీదేవి పోచమ్మ ఆలయం, కళాసిగూడలోని ముత్యాలమ్మ ఆలయం, రాష్ట్రపతి రోడ్డులోని మావురాల పెద్దమ్మ ఆలయం, శివాజీనగర్లోని పీనుగుల మల్లన్న ఆలయం, సెకండ్బజార్లోని డొక్కలమ్మ దేవాలయం, బండిమ్మెట్లోని పోచమ్మ ఆలయం వద్ద నిర్వహించిన తొట్టెల, ఫలహార బండ్ల ఊరేగింపులను తిలకించడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
డిజెల సందడి
యువజన సంఘాలు, భక్తజన మండళ్లు ఏర్పాటు చేసిన వేదికలపె డిజేలు సందడి చేశారు. యువత కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. దారి పొడవునా భక్తులు కొబ్బరికాయలు, పూలు, పండ్లు, అగరబత్తులు, హారతి కర్పూరం సమర్పించి మొక్కుకున్నారు. విద్యుద్దీప కాంతుల మధ్య సోమవారం అర్ధరాత్రి వరకు సాగిన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది.
స్టెప్పులేసిన తలసాని, అంజన్
అంబారీ ఊరేగింపులో డప్పు వాయిద్యాలు, మేళతాళాలకు అనుగుణంగా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శీలం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకుడు కోషికె కిషోర్కుమార్ తదితరులు డ్యాన్స్ చేశారు. వాళ్లను చూసి ఇతర నాయకులు, వలంటీర్లు, భక్తులు కూడా అడుగులేశారు.
కళకళలాడిన పుర వీధులు
ఉజ్జయినీ మహాకాళి జాతరలో భాగంగా లష్కర్లోని ఆలయాల నిర్వాహకులు, భక్తజన మండళ్లు, యువజన సంఘాలు, ప్రజా ప్రతినిధులు, పార్టీల నేతలు ఏర్పాటు చేసిన మైకులు, సౌండ్బాక్సులతో ప్రధాన రహదారులు, వీధులు మార్మోగాయి.
అమ్మా బయలెళ్లినాదో..
అమ్మవారి ఔన్నత్యాన్ని చాటుతూ హోరెత్తిన జానపద గీతాలతో లష్కర్ భక్తిపారవశ్యంలో ఓలలాడింది. రంగురంగుల విద్యుద్దీపాల మధ్య ఆలయాలకు తండోప తండాలుగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని స్తుతిస్తూ చేసిన భజనలు చేశారు. డప్పుల మోతలు, బ్యాండు బాజాలు, యువకుల కేరింతలతో పురవీధులు హోరెత్తాయి.
ఊపిరి పీల్చుకున్న పోలీసులు
లష్కర్
బోనాల
జాతర
శాంతియుతంగా
ముగియడంతో
పోలీసులు
ఊపిరి
పీల్చుకున్నారు.
భక్తుల
నుంచి,
ప్రజా
ప్రతినిధుల
నుంచి
పెద్దగా
ఫిర్యాదులు
లేకుండా
ఉత్సవాలు
ప్రశాంతంగా
ముగియడంతో
పోలీసులు
హాయిగా
నిట్టూర్చారు.
భక్తిపారవశ్యంతో..
భక్తులు అమ్మవారి ఎదుట భక్తిపారవశ్యంతో తేలిపోయారు. అశేష ప్రజానీకం అమ్మవారి ఊరేగింపు కోసం వచ్చారు.