బాబుతో పొత్తు కోసం పురంధేశ్వరి సర్దు'బాట' (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలపై బిజెపి నేత, ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలుగుదేశంతో బిజెపి పొత్తు కోసం ఆమె తనకు ఏ మాత్రం పలుకుబడి లేని కడప జిల్లాలోని రాజంపేట నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధపడ్డారు.
నిజానికి పురంధేశ్వరి విశాఖపట్నం లోకసభ సీటును ఆశించారు. అది కాకుంటే విజయవాడ సీటును కోరుకున్నారు. కానీ ఈ రెండు సీట్లు కూడా పురంధేశ్వరికి దక్కకుండా చంద్రబాబు అడ్డుపడ్డారనే విమర్శలు ఉన్నాయి. టిడిపితో పొత్తు బెడిసికొడితే విజయవాడ నుంచి నామినేషన్ వేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు.
టిడిపితో పొత్తు లేకుంటే తాను కృష్ణా జిల్లా విజయవాడ లోకసభ స్థానం నుండి తమ పార్టీ నుండి నామినేషన్ వేద్దామనుకున్నానని చెప్పారు. పొత్తు చర్చలు సఫలమైనందున తాను రాజంపేట నుండి పోటీ చేస్తానని చెప్పారు. తనకు తెలుగుదేశం సహకరిస్తుందని తాను భావిస్తున్నాని చెప్పారు. పొత్తులో ఒకరికి మరొకరు సహకరించుకుంటారని, ఆ నమ్మకం తనకు ఉందన్నారు. విశాఖ స్థానంపై తాను ఒత్తిడి చేయలేదన్నారు.
మీడియాతో పురంధేశ్వరి
బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య సర్దుబాటు జరిగిన తర్వాత దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు.
పొత్తు బెడిసికొడితే..
తెలుగుదేశం పార్టీతో పొత్తు బెడిసికొడితే కృష్ణా జిల్లా విజయవాడ లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నట్లు ఆమె తెలిపారు.
భర్త దూరమే..
కాంగ్రెసు నుంచి బిజెపిలో చేరిన పురంధేశ్వరి ఎన్నికల్లో పోటీకి సిద్ధపడగా, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
ఒత్తిడి చేయలేదన్నారు..
విశాఖపట్నం లోకసభ సీటు కోసం తాను ఒత్తిడి చేయలేదని పురంధేశ్వరి చెప్పారు గానీ ఆమె ఆ సీటును కోరుకున్నారు.
రాజంపేటలో చెమటోడ్చాల్సిందే..
పురంధేశ్వరికి రాజంపేటలో తెలుగుదేశం పార్టీ సహకరిస్తుందో లేదో తెలియదు. దానికి తోడు, జగన్ ప్రాబల్యం ఆ సీటులో ఎక్కువగా ఉంది. విజయానికి పురంధేశ్వరి చెమటోడ్చాల్సిందే.