వ్యభిచార గృహంపై దాడి: నిర్వాహకురాలు, విటుల అరెస్ట్
హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తమకు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఓ ఇంటిపై దాడి చేశారు. ఓ యువతి, నిర్వాహకురాలు, ముగ్గురు విటులతోపాటు పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాలోని రాజమండ్రికి చెందిన మహిళ(48) కాప్రా సర్కిల్ పరిధిలోని గాంధీనగర్లో గుట్టుచప్పుడు కాకుండా ఇతర యువతులతో వ్యభిచారం నిర్వహిస్తోంది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఎస్సై యాదిగిరి తన సిబ్బందితో కలిసి గురువారం వ్యభిచార గృహంపై దాడి చేశారు.
దాడిలో ముగ్గురు వ్యక్తులు కీసరకు చెందిన మచ్చ మహేష్, కుషాయిగూడ వినాయక్నగర్కు చెందిన డి మురళీధర్ రెడ్డి, ఎస్. హరిప్రసాద్ రెడ్డి, నాగారానికి చెందిన యువతిని అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు నిర్వాహకురాలిని, ముగ్గురు విటులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యువతిని రెస్క్యూ హోంకి తరలించారు.
వివాహిత అదృశ్యం
ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లిన వివాహిత మహిళ కనిపించకుండా పోయిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎన్జీవోస్ కాలనీలో నివాసముండే పవిత్ర(25) బుధవారం సాయంత్రం బయటకు వెళ్లింది. భర్త నరేష్ ఉద్యోగానికి వెళ్లి తిరిగి వచ్చే వరకు ఇంట్లో లేదు. దీంతో బంధువులు, స్నేహితులను ఆరా తీశాడు. ఫలితం లేకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.