నందిగామలో పోలింగ్: ఓటేసిన తంగిరాల సౌమ్య
మచిలీపట్నం: దివంగత శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావు ఆకాల మరణంతో అనివార్యమైన కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ శనివారం ప్రశాంతంగా జరుగుతోంది. తంగిరాల ప్రభాకర రావు కూతురు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం రఘునందనరావు ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
లక్షా 84 వేల 64 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 130 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవసరమైన వౌలిక వసతులు కల్పించారు. 1240 మంది పోలింగ్ ఆఫీసర్లను నియమించారు.
ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఒక పోలింగ్ ఆఫీసర్తో పాటు ఇద్దరు అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తారు. నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది.