నాలుకకోస్తామని కెసిఆర్: పొన్నాల కౌంటర్, జైరాం ప్రశ్న
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సోమవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కెసిఆర్ అభినవ శిశుపాలుడు అన్నారు. అబద్ధాలాడటం కెసిఆర్కు కొత్తేం కాదని ఎద్దేవా చేశారు.
సోనియా ఎన్నో కష్టాల కోర్చి తెలంగాణ ఇచ్చారన్నారు. పూటకో మాట మార్చే కెసిఆర్ను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, వారు తగిన బుద్ధి చెబుతారన్నారు. తెరాసను విలీనం చేయమని తాము అడగలేదని, ఆయననే విలీనం చేస్తానని ప్రకటించారన్నారు.
కెసిఆర్కు జైరాం ప్రశ్న
ఇద్దరు ఎంపీలతో తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని కేంద్రమంత్రి జైరాం రమేష్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో కెసిఆర్ లేదా తెరాస పాత్ర ఏమీ లేదన్నారు. త్వరలో సీమాంధ్రలో సోనియా, రాహుల్ పర్యటిస్తారని చెప్పారు. బిజెపి-టిడిపి పొత్తుతో ఇరు ప్రాంతాల్లో తమకు ఎలాంటి నష్టం లేదన్నారు. సీమాంధ్రలో ప్రస్తుతం ఎదురు గాలి వీచినా.. భవిష్యత్తు తమదే అన్నారు.
నాలుక కోస్తాం: కెసిఆర్
తెరాసను విమర్శిస్తే నాలుక కోస్తామని ఆ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ హెచ్చరించారు. సోమవారం జిల్లాలోని కోరుట్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నీటిని రఘువీరా రెడ్డి ఆంధ్రాకు తరలిస్తుంటే జెండా ఊపిన సన్సాసి పొన్నాల అన్నారు. పొన్నాల సీట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డే చెప్పారన్నారు. తన ఆస్తులపై విచారణకు సిద్ధంగా ఉన్నానని కెసిఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు పావలా పని చేసి మిగిలింది జేబులో వేసుకుంటారన్నారు.