పవన్ కళ్యాణ్: రోజుకో ట్విస్ట్, 19న పొట్లూరి నామినేషన్!
విజయవాడ: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది. జనసేన పార్టీ తరఫున ఏడుగురు అభ్యర్థులు స్వతంత్రంగా ఏడు లోకసభ స్థానాలకు పోటీ చేయనున్నారు. వారు పార్టీ తరపున కాకుండాస్వతంత్ర అభ్యర్థులుగా జనసేన అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఇందులో భాగంగా విజయవాడ లోకసభ స్థానానికి పొట్లూరి వర ప్రసాద్ ఈ నెల 19న నామినేషన్ వేయనున్నారని తెలుస్తోంది.
పొట్లూరి వర ప్రసాద్కు టిడిపి, బిజెపి కూటమి తరపున టికెట్ నిరాకరించిన నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన ఏడుగురు అభ్యర్థులను ఇండిపెండెంట్లుగా నిలబెట్టనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ అంతర్గత సమావేశం ఏర్పాటు చేసి, ఈ ఎన్నికల్లోనే ప్రజలముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారట.
పొట్లూరితో పాటు మిగిలిన ఆరుగురు కూడా 19వ తేదీన నామినేషన్లు దాఖలు చేయవచ్చునని సమాచారం. దీనిపై పవన్ కళ్యాణ్ పెదవి విప్పుతారా అనేది చూడాలి.
కాగా, ఇప్పటికే టిడిపి, బిజెపిలకు మద్దతిస్తున్న పవన్.. మల్కాజిగిరి లోకసభ అభ్యర్థి జయప్రకాశ్ నారాయణకు కూడా మద్దతు ప్రకటించారు. మరోవైపు తన పార్టీ అభ్యర్థులను నేరుగా ఎన్నికల బరిలో నిలపనున్నారు. దీంతో సీమాంధ్రలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి.
పవన్తో పొట్లూరి భేటీ
మరోవైపు పవన్ కళ్యాణ్తో పొట్లూరి గురువారం భేటీ అయ్యారు. పొట్లూరికి మద్దతుపై పవన్ ఈ రోజు సాయంత్రం లోగా తన అభిప్రాయం వెల్లడించే అవకాశముంది.