పవన్తో పొట్లూరి, మార్పు: పొత్తుపై రంగంలోకి వెంకయ్య
హైదరాబాద్: విజయవాడ లోకసభ సీటును భారతీయ జనతా పార్టీ కేంద్రమాజీ మంత్రి పురంధేశ్వరికి కేటాయించిన నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. విజయవాడపై పట్టు వీడాలని పవన్ సూచించినట్లుగా తెలుస్తోంది.
టిడిపి, బిజెపి కటీఫ్ నేపథ్యంలో ఎవరు అవకాశం ఇస్తే ఆ పార్టీ నుండి పోటీ చేయాలని పొట్లూరి భావిస్తున్నారట. టిడిపి నుండి విజయవాడ తరఫున కేశినేని నాని, బిజెపి నుండి పురంధేశ్వరి బరిలో ఉన్నందున.. నామినేషన్ ఘట్టం శనివారంతో ముగుస్తున్నందున ఆయన మరో స్థానం వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. టిడిపి లేదా బిజెపి అవకాశమిస్తే కాకినాడ లేదా విశాఖ బరిలో దిగాలని చూస్తున్నారని సమాచారం.
రంగంలోకి వెంకయ్య
టిడిపితో పొత్తు వ్యవహారంపై చర్చించేందుకు బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు రంగంలోకి దిగారు. అలాగే సీమాంధ్ర ప్రాంతం బిజెపి అధ్యక్షులు కె హరిబాబుతో పాటు వీర్రాజు ఇప్పటికే హైదరాబాదు చేరుకున్నారు. వారితో వెంకయ్య నాయుడు చర్చించి మరికాసేపట్లో టిడిపితో పొత్తుపై స్పష్టత ఇచ్చే అవకాశముంది. టిడిపి నేత సుజనా నివాసంలో చర్చలు జరుపుతున్నారని సమాచారం. మరోవైపు చంద్రబాబుతో ఆర్ఎస్ఎస్ నేత రాజ్ పురోహిత్, ప్రకాశ్ జవదేకర్ భేటీ అయ్యారు.
హీరో నందమూరి బాలకృష్ణ శుక్రవారం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో భేటీ అయ్యారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు, రాజకీయ పరిణామాలపై ఆమెతో చర్చించారు. భేటీ అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా రేపు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్టు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో టిడిపి అధికారంలోకి వస్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు.