రాజధానిపై మంత్రి, బాబుకు చిక్కు: 'కర్నూలు' డిమాండ్
కర్నూలు: కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. విద్యార్థి సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి రాజధాని కావాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు సీమ నేతలు, మేధావులు కర్నూలును రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, వారం రోజులుగా విద్యార్థి సంఘాలు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. సోమవారం జాతీయ రహదారుల దిగ్బంధనంతో మరింత వేడెక్కింది.
విద్యార్థులు, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆందోళనతో జిల్లా గుండా వెళ్లే జాతీయ రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రాష్ట్రంలో రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలో సిఫారసు చేయాల్సిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇంకా సిద్ధం కాకుండానే రాష్ట్ర పురపాలక శాఖమంత్రి నారాయణ రాజధాని ఏర్పాటుపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యా వ్యాపారంతో విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీఎత్తున భూములు కొనుగోలు చేసిన ఆయన, ఆ ప్రాంతంలో రాజధాని వస్తే తన ఆస్తులు భారీఎత్తున పెంచుకోవచ్చని వ్యూహం రచిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో రాజధానికి అవసరమైన భూములు లేవని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడినా అక్కడే రాజధాని అంటూ ప్రకటనలు చేయడంతో ఆ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు.
ఇందుకు మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి చంద్రబాబులే కారణమన్నారు. కర్నూలును రాజధాని చేసే అంశాన్ని పరిగణించాలన్నారు. రాజధాని ఇవ్వకపోతే తక్షణం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు. విద్యార్థుల ఉద్యమానికి వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. శాస్ర్తియంగా అధ్యయనం చేసి రాజధాని ఎక్కడనే అంశాన్ని పరిశీలిస్తున్న కేంద్ర కమిటీని కాదని మంత్రి నారాయణ ప్రకటనలు చేయడంపై ఆ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బాబు ఆయన చేతిలో కీలుబొమ్మ అయ్యారన్నారు.