పురంధేశ్వరి ఆస్తులు రూ.3.27 కోట్లు, కోటి అప్పులు
కడప: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ రాజంపేట లోకసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి తన ఆస్తులను, అప్పులను అఫిడవిట్లో ప్రకటించారు. ఆస్తులు రూ.3.27 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. అప్పులు 1.15 కోట్ల రూపాయలుగాను చూపించారు.
ఇందులో పురంధేశ్వరి ఆస్తులు రూ.2.22 కోట్లు, ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వర రావు ఆస్తులను రూ.1.05 కోట్లుగా చూపించారు. పురంధేశ్వరి అప్పులు 30.50 లక్షలు, భర్త వేంకటేశ్వర రావు అప్పులు రూ.87 లక్షలుగా చూపించారు.
తన వద్ద 1,679 గ్రాముల బంగారం (రూ.44,79,518), వజ్రాభరణాల విలువ 26లక్షల 07 వేల 825 రూపాయలు, ముత్యాల ఆభరణాలు 92 వేల 500 రూపాయలు విలువగా ఉన్నట్లు పురంధేశ్వరి చూపించారు.
రూ.10 లక్షల విలువ చేసే మారుతీ ఎస్టీమ్ ఉందని పేర్కొన్నారు. పురంధ్రీశ్వరి 2012-13 సంవత్సరానికిగాను 6 లక్షల 30 వేల 629 రూపాయలు, వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు 1,54,43,734 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. కాగా, పురంధేశ్వరి రాజంపేట లోకసభకు శనివారం నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.