రాజంపేట నుండే పురంధేశ్వరి, నామినేషన్లో సోదరులు
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి సీటుపై సందిగ్ధత తొలగిపోయింది. తెలుగుదేశం, బిజెపిల మధ్య పొత్తుల చర్చలు విజయవంతం కావడంతో ఎవరికి కేటాయించిన సీట్లలో వారే పోటీ చేయనున్నారు. ఒక్క ఇచ్ఛాపురం అసెంబ్లీని మాత్రం బిజెపి టిడిపికి వదులుకుంది.
మిగతా సీట్లన్నీ యథాతథం. బిజెపి సీట్లలో ఆ పార్టీ అధిష్టానం నిలబెట్టిన అభ్యర్థులే పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో ఇంతకు ముందు కేటాయించిన విధంగానే పురంధేశ్వరి రాజంపేట లోకసభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆమె నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి ఆమె సోదరులు జయకృష్ణ, జయశంకర్ కృష్ణతో పాటు పలువురు కుటుంబసభ్యులు హాజరవుతారు.
కాగా, సీమాంధ్రలో బిజెపి, టిడిపిల పొత్తుపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పురంధేశ్వరిని పోటీ చేయించాలని బిజెపి చూసింది. ఎంపి అభ్యర్థిగా ఆమె శనివారం నామినేషన్ వేసేందుకు కూడా సిద్ధపడ్డారు.
శుక్రవారం సాయంత్రం టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ నేతలు వెంకయ్య నాయుడు, హరిబాబు, ప్రకాశ్ జవదేకర్ల మధ్య మూడు గంటలకు పైగా చర్చలు జరిగాయి. ఈ చర్చలు ఫలవంతంగా ముగిశాయి.