పురంధేశ్వరితో ఫ్యామిలీ: జై బాలయ్య, వెంకయ్య చురక
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తరఫున రాజంపేట లోకసభ నియోజకవర్గ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నామినేషన్ ఘట్టంలో భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, సోదరులు జయకృష్ణ, జయశంకర కృష్ణ, బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడులు ఉన్నారు.
తొలుత ఆమె కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిత్తూరు చేరుకున్న ఆమెకు బిజెపి, టిడిపి శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. రాజంపేటలో భారీ ఎత్తున ఇరు పార్టీలూ కలసి నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.
అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో బిజెపి తనపై బృహత్తర బాధ్యతను ఉంచిందన్నారు. బిజెపి, టిడిపి సహకారంతో పోటీ చేస్తున్నట్లు చెప్పారు.
పురంధేశ్వరి నామినేషన్ సందర్భంగా బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు చలోక్తులు విసిరారు. ఫోన్లను మన్మోహన్ మోడ్లో పెట్టుకోవాలంటూ ఎద్దేవా చేశారు. అంటే సైలెంట్లో పెట్టుకోవాలని ఆయన అర్థం. చిత్తూరు ఎంపి శివ ప్రసాద్ నిలబడి ఉన్నారు. అప్పుడు వెంకయ్య.. ఆయనను అలాగే నిలబడనివ్వండి, ఎన్నికల్లో నిలబడ్డారు కదా అన్నారు. కొందరు అభిమానులు జై బాలయ్య అంటూ నినదించారు. కొద్దిగా ఆగాలంటూ వెంకయ్య అన్నారు.