పోటీకి కిరణ్ రెడ్డి దూరం: పురంధేశ్వరి నామినేషన్
హైదరాబాద్: కడప జిల్లాలోని రాజంపేట బిజెపి లోకసభ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి శనివారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు సహా పలువురు తెలుగుదేశం, బిజెపి నాయకులు పాల్గొన్నారు.అంతకు ముందు పురందేశ్వరి శనివారం ఉదయం చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదిలావుండగా ఎన్నికలకు దూరంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్కుమార్ రెడ్డి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.
శనివారం ఉదయం చిత్తూరు జిల్లాలోని పీలేరు జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్ కుమార్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కిరణ్ హాజరయ్యారు. పీలేరు నుంచి ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్)లో నామినేషన్లకు శనివారం చివరి రోజు. దీంతో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.