జగన్ పార్టీలో అంతర్మథనం: మాట్లాడి చూస్తా..కృష్ణంరాజు
హైదరాబాద్: పలువురు నేతలు వరుసగా పార్టీని వీడుతుండటంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆత్మరక్షణలో పడిందా? అంటే అవుననే అంటున్నారు. అన్ని పార్టీల్లో ఉన్నట్లే తమ పార్టీలోను విభేదాలు ఉన్నాయని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి అంగీకరించిన విషయం తెలిసిందే. పార్టీలో అంతర్గత విభేదాలు సహజమని, అవి ప్రతి పార్టీలోనూ ఉంటాయని, అయితే క్రమశిక్షణ తప్పితే ఎంతటివారిపైనైనా చర్యలు తీసుకుంటామని మేకపాటి వ్యాఖ్యానించారు.
మరోవైపు పార్టీలో చేరే వారికి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి షరతులు పెడుతున్నారట. దీనిపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాకుండా తొలి నుండి పార్టీని వీడాలనుకున్న వారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేయడం లేదట. పార్టీలో ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ లేదని, దీనికి అధిష్టానం వైఖరే కారణమనే వాపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
సుజయ కృష్ణ గుడ్ బై చెబుతారా?
బొబ్బిలికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, ఉత్తరాంధ్ర కన్వీనర్ సుజయ్ కృష్ణ రంగారావు ఆ పార్టీతో తెగదెంపులకు సిద్ధపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సుజయ్ కృష్ణ కొద్దిరోజులుగా పార్టీ అధినేత జగన్ పట్ల అసంతృప్తితో ఉన్నారట. రానున్న ఎన్నికలకు టికెట్ల కేటాయింపు విషయంలో తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆయన మనస్తాపం చెందుతున్నట్టు తెలుస్తోంది.
శ్రీకాకుళానికి సంబంధించి టికెట్ల కేటాయింపు వ్యవహారాన్ని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసుకు జగన్ అప్పగించినట్లు సమాచారం. ఆ జిల్లా వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దన్నట్లుగా జగన్ పరోక్షంగా సంకేతాలివ్వడంపై సుజయ్ కృష్ణ అలక వహించారట.
మరోవైపు పార్టీలో తాను కొంత మనస్తాపంతో ఉన్న మాట విషయం నిజమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రఘురామ కృష్ణం రాజు తెలిపారు. ఫిబ్రవరి 3 లేదా 4న పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ను కలిశాక నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. పార్టీ ప్లీనరీకి ఆహ్వానం అందిందని, తాను కుటుంబ సభ్యులతో వ్యక్తిగత కార్యక్రమానికి వెళ్తున్నానని, అందుకే ప్లీనరీకి హాజరు కావడం లేదని చెప్పారు.