జగన్ పార్టీలో: బాబుపై రఘువీరా, కేసీఆర్పై పొన్నాల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేయడాన్ని రఘువీరా తీవ్రంగా ఖండించారు. స్వామినాథన్ నివేదిక ప్రకారమే ఆదర్శ రైతు వ్యవస్థను కాంగ్రెసు పార్టీ ఏర్పాటు చేసిందన్నారు.
ఆదర్శ రైతులు కేవలం కాంగ్రెసు పార్టీలోనే లేరన్నారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, జగన్ పార్టీలోను ఉన్నారన్నారు. ఆదర్శ రైతులు కాంగ్రెసు నాయకులంటూ రద్దు చేసిన చంద్రబాబు.. ఎన్నికల సమయంలో తమ పార్టీ నేతలకు టిక్కెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆదర్శ రైతు వ్యవస్థను కొనసాగించాల్సిందే అన్నారు. జీవోలను రద్దు చేయాలన్నారు. అనంతపురం, తాడిపత్రి నుండి వచ్చిన హంతకులకు టిక్కెట్లు ఇలా ఇచ్చారని ప్రశ్నించారు. వారు టీడీపీలోకి రాగానే పునీతులయ్యారా అన్నారు.
కేసీఆర్ పైన పొన్నాల
ప్రతి రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ ఉంటుందని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ఇంటికి లక్ష రుణమాఫీ అని జీవో విడుదల చేయడం విడ్డూరమని పొన్నాల అన్నారు. కేసీఆర్ మాట తప్పే వ్యక్తి అని దీంతో అర్థమైపోయిందన్నారు. ప్రభుత్వంలో అనుభవరాహిత్యం కనిపిస్తోందని విమర్శించారు. నిర్ణయాలలోనే దుందుడుకు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తన ఆస్తుల పైన నాయిని ఎలాంటి విచారణ అయినా చేయించుకోవచ్చునని సవాల్ చేశారు.
కేసీఆర్ పాలన ఇలాగే ఉంటే పరిశ్రమలు తరలిపోతాయని హెచ్చరించారు. గేమింగ్ క్లబ్కు ఇచ్చిన భూమిని ఇతరులకు ఇవ్వవద్దని సూచించారు. తెరాస ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందన్నారు. విభజన బిల్లు ఆధారంగానే ఫీజు రీయింబర్సుమెంట్స్ జరగాలన్నారు.