పాపం మాదే: విభజనపై రఘువీరా, చిరు 'దూరం' పైనా
హైదరాబాద్: రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్దేనని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు తాము బాధ్యత వహిస్తామని, అయితే ఈ పాపంలో మిగతా పార్టీలు కూడా భాగస్వామ్యం వహించాయని ఆయన అన్నారు.
అన్ని రాజకీయ పార్టీలు విభజనకు ఆమోదం తెలుపుతూ లేఖలు ఇచ్చిన తర్వాతే కేంద్రంలోని యుపిఏ సర్కార్ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగినా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఎంపీలు ఏమీ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
పోలవరం, ప్రత్యేక హోదా, లోటు బడ్జెట్ విషయాల పైన కేంద్రం ప్రభుత్వ బడ్జెట్లో కనీసం ప్రస్తావించలేదన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ పునర్విభజన బిల్లులోని అంశాలను ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ పునర్నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణ పైన దృష్టి సారిస్తామని చెప్పారు. ఇటీవల పార్టీ కార్యకలాపాలకు చిరంజీవి దూరంగా ఉంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. అదే లేదని, ఆయన పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వెళ్లాల్సిన వారు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లారని, నికార్సయిన నాయకులు, కార్యకర్తలు ఇంకా పార్టీలోనే ఉన్నారన్నారు.