బాబుకి రఘువీరా హెచ్చరిక, చెప్పగలవా: జగన్పై టీడీపీ
హైదరాబాద్: రెండు నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగుల వయోపరిమితి పెంచడం మినహా చేసిందేమీ లేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆదివారం అన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు నిలిపి వేస్తామంటే తాము ఊరుకునేది లేదని బాబును రఘువీరా హెచ్చరించారు. వర్షాలకు దెబ్బతిన్న భవనాలు బాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాజధాని కమిటీ వెనుక ఉన్న రహస్యం ఏమిటో చెప్పాలన్నారు. సెజ్ల ఆధునికీకరణ పేరుతో కోట్లు ఖర్చు పెడుతున్నారని, సచివాలయం నుండి ఇంకా పాలన ప్రారంభం కాకపోవడం శోచనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. పంట రుణమాఫీపై మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలని విశాఖలో పార్టీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు హాజరయ్యారు.
గంగిరెడ్డితో సంబంధాలు లేవని చెప్పగలరా: జగన్కు దేవినేని
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డితో తనకు సంబంధాలు లేవని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా అని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు. తిరుపతిలో ఆయన మాట్లాడారు. ఎర్రచందనం డబ్బుతోనే జగన్ ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు.
శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి
హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో అన్యమత ప్రచారం సరికాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అన్యమత ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వకుళామాత ఆలయ నిర్మాణానికి టీటీడీ పాలక మండలి ఆమోదముద్ర వేసినా... అధికారుల నిర్లక్ష్యంతో ఆలయ పనులు ఇంకా ప్రారంభం కాలేదని విమర్శించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఇంటర్ పోల్ సహాయం తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. ఈ ఉదయం కిషన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.