నాతో కౌగిలింత, తర్వాత వెన్నుపోటు: కెసిఆర్పై రాహుల్
నిజామాబాద్: పేరేత్తకుండా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యక్తి పేరు తను చెప్పనని కెసిఆర్పై విమర్శల వర్షం కురిపించారు. రాహుల్ గాంధీ సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత కెసిఆర్తోపాటు టిఆర్ఎస్ నాయకులు తనను తన ఇంటికి వచ్చి కలిశారని తెలిపారు.
తొలిసారి వారిని పార్లమెంటులో చూశానని చెప్పిన ఆయన, తర్వాత తన ఇంటి వద్ద చూశానని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. అనంతరం తనతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని చెప్పారని తెలిపారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ను విలీనం చేస్తానని తెలిపారని రాహుల్ చెప్పారు. ఇంట్లో నుంచి బయటికి వచ్చి మళ్లీ తనను ఆలింగనం చేసుకున్నాడని, మీతోనే ఉంటానని చెప్పారని రాహుల్ గాంధీ తెలిపారు. ఏం జరిగిన మీతోనే ఉంటానని కెసిఆర్ తనతో చెప్పారని రాహుల్ తెలిపారు.
మళ్లీ బయటికి వచ్చాడు వెన్నుపోటు పొడిచినట్లు అతను చేసిన వాగ్ధానాన్ని మర్చిపోయాడని రాహుల్ ఆరోపించారు. ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడేనని చెప్పారని, ఆ వాగ్ధాన్ని కూడా కెసిఆర్ మార్చిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెప్పినట్లుగానే ప్రజలకు కూడా అబద్ధాలు చెబుతున్నారని రాహుల్ ఆరోపించారు. ఆ వ్యక్తి మాటలు నమ్మాలా? వద్దా? అనేది ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. రాజకీయ నాయకుడంటే మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు.
60ఏళ్ల తెలంగాణ ప్రజల కల సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీనేని రాహుల్ గాంధీ చెప్పారు. జూన్ 2న తెలంగాణ ప్రజల కల నెరవేరబోతోందని అన్నారు. ఒక రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా చేస్తున్నాం.. రెండు రాష్ట్రాలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేకుండా తెలంగాణ కల సాకారమయ్యేది కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆయన చెప్పారు.
2001లో టిఆర్ఎస్ ఆవిర్భవించిందని, 2000 సంవత్సరంలోనే తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోరాటం చేశారని అన్నారు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. కొన్ని రాజకీయా పార్టీలు హిందూ, ముస్లింలకు ఘర్షణలు పెడుతున్నాయని, ఆ పార్టీల పేరు పలకడం తనకు ఇష్టం లేదని అన్నారు. వేర్పాటువాదులను ఎన్నికల్లో ఓడించాలని రాహుల్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, రాహుల్ గాంధీ ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ నేత శ్రవణ్ తెలుగులోకి అనువదించారు.