హామీలను మరిచిపోతుంది: తెరాసపై రాహుల్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని లక్ష్యం చేసుకుని కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని సాగించారు. తెరాస అధికారం కోసం అర్రులు చాస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను తెరాస మరిచిపోతుందని రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం మహబూబ్నగర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ బిల్లు రూపకల్పనలో, ఆమోదంలో తెరాస పాత్ర లేదని ఆయన అన్నారు.
తెలంగాణ ఇస్తే తెరాసను తమ పార్టీ విలీనం చేస్తామని హామీ ఇచ్చారని, హామీలను నిలబెట్టుకునే లక్షణం తెరాసకు లేదని, తమకు ఇచ్చిన హామీని మరిచిపోయిందని, ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా మరిచిపోతుందని ఆయన అన్నారు. తెరాస 2001లో ఏర్పడిందని, తమ పార్టీ శాసనసభ్యులు 41 మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని 2000లలోనే వినతిపత్రి ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
సోనియా లేకుండా తెలంగాణ కల సాకారమయ్యేది కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రగతి కోసం అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన చెప్పారు. పదేళ్ల పాటు పన్నుల్లో రాయితీలు ఇస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలోని పది జిల్లాలకు అభివృద్ధిని విస్తరింపజేస్తామని, తమకు అధికారం ఇస్తే తెలంగాణ మారుమూల ప్రాంతాలకు కూడా ప్రగతి విస్తరిస్తుందని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజల 60 ఏళ్ల స్వప్నం జూన్ 2వ తేదీన సాకారమవుతోందని, ఈ స్థితిలో రెండు రాష్ట్రాల అభివృద్ధిని కాంగ్రెసు కాంక్షిస్తోందని ఆయన అన్నారు. తెంలగాణ కలను సాకారం చేసుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేశారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి తెలుగుదేశం, బిజెపిలు ప్రయత్నాలు చేశాయని ఆయన విమర్శించారు. ఏకాభిప్రాయం సాధించి, ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాననే హామీని తెరాస మరిచిపోయిందని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబిసీలు, మహిళలకు ప్రగతిలో భాగస్వామ్యం కల్పిస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెసు లౌకికవిధానానికి కట్టుబడి పనిచేస్తుందని ఆయన చెప్పారు. బిజెపి హిందూముస్లింలకు మధ్య చిచ్చు రేపుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు అధికారంలోకి వస్తే తెలంగాణలో పదేళ్ల పాటు పన్ను రాయితీ కల్పిస్తామని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ప్రగతిని సాధించి తీరుతామని, అప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలితం దక్కుతుందని ఆయన చెప్పారు.
ఉత్పత్తులపై మేడ్ ఇన్ తెలంగాణ, మేడిన్ ఇండియా అని పెట్టుకునే బ్రాండ్ ఇమేజ్ను తాము కల్పిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చూస్తామని ఆయన చెప్పారు. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. గూడు లేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన అన్నారు. తెలంగాణ మేడ్ అనే విధంగా అభివద్ధి చేస్తామని ఆయన చెప్పారు. చిన్న చిన్న స్వప్నాలు కాదు, పెద్ద కలలను సాకారం చేసుకోవాలని ఆయన అన్నారు.