రైలు ప్రమాదం: 15 మంది పరిస్థితి ఆందోళనకరం
మెదక్: మెదక్ జిల్లా రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు యశోదా చికిత్స పొందుతున్నారు. 15 మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు సమాచారం. ఆర్ఆర్ ఆస్పత్రి నుంచి, బాలాజీ ఆస్పత్రి నుంచి గాయపడిన విద్యార్థులను యశోదా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో 16 మంది మరణించినట్లు తెలంగాణ మంత్రి పద్మారావు చెప్పారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. యశోదా ఆస్పత్రిలో 21 మంది చికిత్స పొందుతున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు.
గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో రుచిత, హరీష్, చింటూ, శిరీష్, అక్షిత, వరుణ్, మహేందర్ రెడ్డి, స్వాతిక, సందీప్, అభినవ్, మహేశ్వర్ రెడ్డి, నిషిత, అస్మిత, మణికంఠ, ఫాతిమా, రుచిత, వైష్ణవి ఉన్నారు. బషీరుద్దీన్, రఘనందన్ రెడ్డి, స్వామి, శ్రీనివాస్, కరుణాకర్, సాయిరాం, త్రిష, శ్రావణి, సబరన్ దాస్ కూడా గాయపడినవారిలో ఉన్నారు.
రైల్వే శాఖపై హరీష్ రావు ఫైర్
గేటును ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రైల్వే శాఖదేనని మంత్రి హరీష్ రావు అన్నారు. మూడేళ్ల నుంచి తాము వినతి చేస్తూనే ఉన్నామని, అయినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఈ విషయంపై కెసిఆర్ రైల్వే మంత్రి సదానందగౌడతో మాట్లాడారని ఆయన అన్నారు. ప్రమాదానికి బాధ్యత రైల్వేదే అని ఆయన అన్నారు. తెలంగాణలోని అన్ని రైల్వే క్రాసింగ్ల వద్ద గేట్లు ఏర్పాటు చేసేలా చూస్తామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన అన్నారు. వారం రోజుల్లో ఇక్కడ గేటు ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారులు చెప్పినట్లు ఆయన తెలిపారు.
విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు యశోదా ఆస్పత్రి వైద్యులు చెప్పారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, విద్యార్థులకు ఉత్తమ చికిత్స అందిస్తున్నామని వారు తెలిపారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్కు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు.
అయితే, ప్రమాదంలో ఎంత మంది మరణించారనేది స్పష్టంగా తెలియడం లేదని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ప్రమాదానికి బాధ్యులైనవారిని ఎవరినీ వదిలిపెట్టబోమని ఆయన అన్నారు. ప్రమాదం బాధాకరమని ఆయన అన్నారు.
ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇప్పటికే విచారణకు ఆదేశించారని ఆయన తెలిపారు. ప్రమాదానికి బాధ్యత రైల్వే శాఖదా, పాఠశాలదా అనే విషయం విచారణలో తేలుతుందని ఆయన చెప్పారు.