రైలు ప్రమాదం: ఒకరికి బదులు మరొకరి అప్పగింత
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదం ఘటనకు సంబంధించి పిల్లల గుర్తింపు తారుమారు అయింది. ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య కూడా ధ్రువీకరించారు. ఒకరి మృతదేహానికి బదులు మరొకరి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. యశోదా ఆస్పత్రి వైద్యులు ఈ విషయాన్ని చెప్పారు.
ధనుష్ అనే విద్యార్థి తల్లిదండ్రులు దత్తు అనే విద్యార్థి మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ధనుష్ మృతదేహమని చెప్పి దత్తు మృతదేహాన్ని వారికి అప్పగించారు. ధనుష్ బతికే ఉన్నాడంటూ సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి వైద్యులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారిని యశోదా అస్పత్రికి రప్పిస్తున్నారు.
దాంతో పాతిపెట్టిన దత్తు మృతదేహాన్ని వెలికి తీసేందుకు శుక్రవారం ఉదయం కిష్టాపూర్ వెళ్లారు. ధనుష్కు ఏ విధమైన ప్రాణహాని లేదని వైద్యులు చెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య శుక్రవారం ఉదయం యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.
మాసాయిపేట దుర్ఘటన అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. 20 మంది యశోదా అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారులకు సూపర్ స్పెషాలిటీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆందోళన చెందవద్దని ఆయన తల్లిదండ్రులను కోరారు.
చికిత్స పొందుతున్నవారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఏడుగురిని వెంటలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నామని, 9 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి చెప్పారు. వైద్య శాఖ కమిషనర్ ఇక్కడే ఉండి వైద్యసేవలను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు ఆస్పత్రి వద్ద బాధితులకు వసతి సదుపాయం కల్పించినట్లు తెలిపారు.