రైలు ప్రమాదం: నిలకడగా 8 మంది విద్యార్థుల ఆరోగ్యం
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల్లో ఎనిమిది మంది ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. శనివారం ఉదయం యశోదా ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయిరాం, రుతిక, సాత్విక, హరీష్, మహిపాల్ రెడ్డి, సద్భావన్, దర్శన్, శివకుమార్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
ఆ ఎనిమిది విద్యార్థులను సాయంత్రం వార్డుకి తరలిస్తామని వైద్యులు చెప్పారు. మరో ఐదుగురి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ అబ్జర్వేషన్లో పెట్టినట్లు వారు తెలిపారు. శరత్, శ్రావణి, శిరీషల ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు చెప్పారు. తరుణ్, వైష్ణవి, వరుణ్, ప్రశాంత్ల ఆరోగ్యం కాస్తా ఆందోళనకరంగా ఉందని చెప్పారు.
ఇదిలావుంటే, మెదక్ జిల్లా వెల్తుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై దక్షిణ మధ్య రైల్వే విచారణ ప్రారంభించింది. ముగ్గురు ఉన్నతాధికారులతో విచారణకు దక్షిణ మధ్య రైల్వే కమిటీని వేసింది.
గురవారం ఉదయం కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన పాఠశాల బస్సును నాందేడ్ ప్యాసెంజర్ రైలు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 16 మంది చిన్నారులు మరణించారు. గాయపడిన విద్యార్థులు సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.