గుర్తు పట్టనరానంతగా, శోకసముద్రం: మృతులు వీరే
మెదక్: ఘోర రైలు ప్రమాదం జరిగిన మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద పరిస్థితి హృదయవిదాకరంగా ఉంది. శోకసముద్రంలా ఉంది. తల్లిదండ్రుల రోదన మిన్నంటుతోంది. వేగంగా వస్తున్న బస్సు బస్సును ఢీకొనడంతో విద్యార్థులు చెల్లాచెదురుగా పడిపోయారు.
మృతదేహాలను వెలికి తీస్తున్నారు. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. స్కూల్ బ్యాగ్ తీసుకుని వెళ్లి వస్తామంటూ ఇంటి నుంచి బయలుదేరిన పిల్లలు తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో తల్లిదండ్రుల రోదన చెప్పనలవి కాకుండా ఉంది. విద్యార్థులంతా ప్రాథమిక పాఠశాల విద్యార్థులే.
మృతులు వీరే
సుమన్, గొల్ల మహేష్, చింతల దివ్య, చింతల చరణ్, విద్య, వంశీ, రజియా, వరుణ్, శ్రుతి, వాహెద్ మృతి చెందినట్లు తెలుస్తోంది. భువన, విష్ణు అనే విద్యార్థులు కూడా మృతి చెందినవారిలో ఉన్నారు. డ్రైవర్ బిక్షపతి పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. క్లీనర్ ధనుష్ గౌడ్ కూడా మరణించాడు. గాయపడిన 12 మంది విద్యార్థులను బాలాజీ ఆస్పత్రి నుంచి యశోదా ఆస్పత్రికి తరలిస్తున్నారు. గాయపడిన కొంత మంది విద్యార్థులను కొంపల్లిలోని ఆర్ఆర్ ఆస్పత్రిలో కూడా చేర్చినట్లు తెలుస్తోంది.
విషయం తెలిసిన వెంటనే రజియా, వహీద్ తండ్రికి గుండెపోటు వచ్చింది. దీంతో అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ప్రమాదంలో వహీద్, రజియా ఇరువురూ మృత్యువాత పడ్డారు.
ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని అంటున్నారు. డ్రైవర్ ఆలస్యంగా విధులకు వచ్చినట్లు, సకాలంలో విద్యార్థులను పాఠశాలకు చేరవేయాలనే ఉద్దేశంతో బస్సును వేగంగా నడిపినట్లు చెబుతున్నారు.