రైలు ప్రమాదం: ఆందోళనతో ఉద్రిక్తం, లాఠీచార్జీ
మెదక్: రైలు ప్రమాదం జరిగిన మాసాయిపేట రైల్వే గేటు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సహాయక చర్యలను చేపట్టడానికి వచ్చిన రైల్వే అధికారులను విద్యార్థి సంఘాల కార్యకర్తలు అడ్డుకున్నారు. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు లేకపోవడమే ప్రమాదానికి కారణమంటూ వారు ఆందోళనకు దిగారు.
ప్రమాద స్థలి వద్ద స్థానికులు కూడా ఆందోళనకు దిగారు. మృతదేహాలను తరలించే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి వారు ప్రయత్నించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు.
ప్రమాద స్థలికి చుట్టుపక్కల గ్రామాలవారు వేలాదిగా తరలి వచ్చారు. దాంతో జాతీయ రహదారిపై ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. సంఘటనా స్థలానికి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చేరుకున్నారు.
రైల్వే పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వారు. తల్లిదండ్రుల రోదనలతో సంఘటనా స్థలం శోకసముద్రమే అయిపోయింది. పిల్లల బ్యాగులు, వారి టిఫిన్ బాక్సులు చెల్లచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలంలో స్థానికులు తెలంగాణ మంత్రి హరీష్ రావును ఘెరావు చేశారు.