మాసాయిపేట రైలు ప్రమాదం: 4 ఊళ్ల గుండెకోత
మెదక్: మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద రైలు భూతం మింగేసిన పిల్లలు నాలుగు గ్రామాలకు చెందినవారు. ఈ నాలుగు గ్రామాల ప్రజలకు కడుపుకోతనే మిగిలింది. మాసాయిపేట ప్రమాదంలో మృతిచెందిన చిన్నారులందరూ ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, కిష్టాపూర్, వెంకటాయ పల్లి గ్రామాలకు చెందినవారే. తమ చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. కొందరు ఆ బాధను తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. మొత్తం ఈ నాలుగు గ్రామాల్లో కలిపి ఒకటి నుంచి పదో తరగతి దాకా చదివే 15 మంది విద్యార్థులు మరణించారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు పేదవాళ్లే.
ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన తుమ్మ వీరబాబు టైలర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పైసా పైసా కూడబెట్టిన డబ్బులతో కొడుకు, బిడ్డల్ని తూప్రాన్లో చదివిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గడ్డమీది స్వామి ఆటో నడుపుతూ ఆ డబ్బుతోనే తన కొడుకుని చదివిస్తున్నాడు. చిన్నపాటి వ్యాపారం చేసుకుంటున్న తుమ్మ వీరేశం తన కుమారుడిని కోల్పోయారు. గుండ్రెడ్డిపల్లిలో కొడుకు, కూతురుని కోల్పోయిన రాములు గతంలో మాజీ ఉప సర్పంచ్. జక్కల యాదగిరి కూడా వ్యవసాయం చేస్తూ పిల్లల బంగారు భవిష్యత్కు తూప్రాన్లో చదివిస్తూ కొడుకు, కూతురిని కోల్పోయారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద గురువారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే పోలీసులు ఐపీసీ 304 ఏ, రైల్వే యాక్ట్లోని 152, 161 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.16 మంది చిన్నారుల ప్రాణాలు కోల్పోవడానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
సమగ్ర దర్యాప్తునకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల నేపథ్యంలో రైల్వే పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. డీఎస్పీ నేతృత్వంలోనిఒక్కో బృందంలో పదిమంది పోలీసులుంటారు. ప్రస్తుతానికి ప్రమా ద కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలపై కేసు బదలాయింపు ఉంటుందని రైల్వే ఏడీజీ కృష్ణప్రసాద్ తెలిపారు.