విభజనలో: జెపికి రాజమౌళి ప్రచారం, కెటిఆర్కి అస్వస్థత
హైదరాబాద్: లోక్సత్తా పార్టీ అధ్యక్షులు, మల్కాజిగిరి లోకసభ అభ్యర్థి జయప్రకాశ్ నారాయణకు మద్దతుగా ప్రముఖ దర్శకులు రాజమౌళి గురువారం ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడారు. జెపిలాంటి వ్యక్తిని పార్లమెంటుకు ఎన్నికవ్వాలన్నారు.
విభజన సమయంలో జెపి సరైన పరిష్కారాన్ని చూపించారని ఆయన అన్నారు. తనకు రాజమౌళి వంటి పెద్ద దర్శకులు మద్దతు పలకడం సంతోషించదగ్గ విషయమని జయప్రకాశ్ నారాయణ ఈ సందర్భంగా అన్నారు. కాగా, త్వరలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా జెపికి మద్దతుగా మల్కాజిగిరిలో ప్రచారం చేయనున్నారు.
కెసిఆర్ రిటైరవ్వాలి: విజయశాంతి
తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పొత్తు సిద్ధమని ప్రకటించి మాట తప్పిన తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని కాంగ్రెస్ నేత, మెదక్ అసెంబ్లీ అభ్యర్థి విజయశాంతి అన్నారు.
గురువారం మెదక్ జిల్లాలోని రామాయంపేటలో చేపట్టిన ఎన్నికల ప్రచారం విజయశాంతి మాట్లాడుతూ నిజాయితీగా పని చేసిన వారిని పార్టీ నుంచి తప్పిస్తారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తాను తెరాస కన్నా సీనియర్ అన్నారు. తన ఎంపీ నిధుల ద్వారా మంజూరైన లైట్లు, మోటర్ పంపులను టీఆర్ఎస్ నాయకులు అమ్ముకున్నారని ఆరోపించారు.
తీవ్ర అస్వస్థతకు గురైన కెటిఆర్
తెరాస నేత కెటిఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డి మండలంలోని మద్దిమల్లలో ప్రచారానికి వెళ్లిన ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో... ఆయనను హైదరాబాదుకు తీసుకు వస్తున్నారు.