గాంధీ, థాక్రేలకన్నా మిన్న: కెసిఆర్పై రాంగోపాల్ వర్మ
హైదరాబాద్: వివాదాస్పద సినిమాలు, వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తన ట్విట్టర్ ఖాతాలో పలు కామెంట్లు చేశాడు. అయితే ఇవి కెసిఆర్ను ప్రశంసిస్తూ ఉండటం గమనార్హం.
వర్మ కామెంట్లు చూస్తుంటే కెసిఆర్కు అభిమానిగా మారిపోయినట్లుగా తెలుస్తోంది. రాంగోపాల్ వర్మ తన ఖాతాలో చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బాగా పని చేస్తున్నారని నా అభిప్రాయం' అని సందేశం పోస్టు చేశాడు.
అంతటితో ఆగకుండా ‘శివసేన అధ్యక్షుడు దివంగత బాల్ థాక్రే, మహాత్మా గాంధీల కంటే కెసిఆర్ బెటర్'గా పని చేస్తున్నారు' అని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అయితే తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తప్పుపట్టడం లేదని పేర్కొన్నాడు.
తాను తెలంగాణ వాడినని.. హైదరాబాద్లోనే పుట్టి పెరిగానని మరో ట్వీట్లో చెప్పారు. రెండు రాష్ట్రాల సిఎంలు విద్యుత్ సమస్యను తీవ్రంగా పరిగణిస్తారని అనుకుంటున్నట్లు మరో ట్వీట్ చేశాడు.