టీపై కేంద్రానికి: రావెల, సభలో మురళీమోహన్ తెలుగు
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తాము కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి రావెల కిషోర్ బాబు మంగళవారం అన్నారు. తాము అఖిలపక్ష బృందంతో బుధవారం ఢిల్లీ వెళ్తామన్నారు. హోంమంత్రి, మానవవనరుల శాఖ మంత్రి తదితరులను కలుస్తామని చెప్పారు. అవసరమైతే ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్, అడ్మిషన్ల విషయంలో జాప్యం పైన తాము కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
సీమకు చెందిన వారు ఒక్కరు లేకపోవడం అన్యాయం: రామకృష్ణ
ఏపీ ప్రభుత్వం రుణమాఫీ అంశం పైన సీపీఐ ఏపీ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. అయితే, కొత్త రాజధాని సలహా కమిటీలో సీమకు చెందిన వారు ఒక్కరు లేకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారని చెప్పారు. ఈసారి కౌలు రైతులకు కూడా రుణాలివ్వాలన్నారు. 27న గుంటూరులో కౌలు రైతుల సమస్యల పైన గుంటూరులో బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు.
పార్లమెంటులో మురళీ మోహన్
దేశంలో అపార వనరులు ఉన్నాయని, పరిశ్రమలు నెలకొల్పితే ఎంతో మందికి జీవనోపాధి లభిస్తుందని ఏపీ ఎంపీ మురళీ మోహన్ మంగళవారం లోకసభలో అన్నారు. ఆయన మధ్యాహ్నం లోకసభలో మాట్లాడారు. పెరుగుతున్న కాలుష్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అడవుల నరికివేతను అడ్డుకొని కాలుష్యరహిత భారత్గా దేశాన్నితీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్షపు నీరు సముద్రం పాలుకాకుండా చూడాలన్నారు. వర్షాల ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి సాధ్యమన్నారు.
లోకసభలో తన మాతృభాషలో అయిన తెలుగులో ప్రసంగిస్తూ.. ప్రవహించి నేటీని నిలువరించాలని, నిలువరించిన నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే తమ ప్రభుత్వ నినాదమన్నారు. అడవుల నరికివేతను అడ్డుకొని కాలుష్య తీవ్రత తగ్గించాలన్నారు. సోలార్ పవర్ను ఉత్పత్తి చేయాలన్నారు. పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలన్నారు. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నియంత్రించాలన్నారు.