ఎపి రాజధాని: భగ్గుమన్న రాయలసీమ, బంద్
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడ - గుంటూరు మధ్య ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకరించారని, రెండు రోజుల్లో ప్రకటన వెలువడుతుందన్న వార్తలతో కర్నూలులో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. విద్యాసంస్థలను మూసివేసి నిరసన తెలిపాయి.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలునే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీ విద్యార్ది సమాఖ్య, ఆర్ఎస్ఎస్ఎఫ్, టిఎస్ఎఫ్, విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలులో బంద్ చేపట్టారు. విద్యాసంస్ధలను మూయిస్తున్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనరసింహ, నాయకులు శ్రీరాములు, రామకృష్ణ, చంద్రప్ప, భరత్కుమార్, రాయలసీమ ప్రజాసమితి అధ్యక్షులు కందనూలు కృష్ణయ్య తదితరులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్కు తరలించారు.
1956కు ముందున్న రాజధాని కర్నూలును ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని లక్ష్మీనర్సింహ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటుచేసిన శ్రీకృష్ణ కమిటీ, బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలను పరిగణలోకి తీసుకుని రాయలసీమలో రాజధాని ఏర్పాటుచేయాలన్నారు.
పార్టీలకు అతీతంగా రాయలసీమకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు రాజధాని సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని, బుధవారం జిల్లాలో విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు.