పవన్ కళ్యాణ్ బర్త్డే కేక్ కట్: రాజధానిపై రాయపాటి
హైదరాబాద్/గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని గుంటూరు-విజయవాడ మధ్యలోనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సిఎం చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని, అందుకు అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
మంగళవారం ఆయన గుంటూరు జిల్లాలోని లక్ష్మీపురంలో జరిగిన సినీనటుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దొనకొండ వద్ద రాజధాని ఏర్పాటు చేయడం సరికాదని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ అసలు అక్కడికి వెళ్లలేదని రాయపాటి చెప్పారు.
దుర్గి మిర్చి యార్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఈ మిర్చి యార్డు వాడుకలోకి వస్తే గుంటూరు మిర్చి యార్డుపై ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యదర్శి మన్నం సుబ్బారావు, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల నాయకులు సతీష్, తదితరులు పాల్గొన్నారు.
ఇరిగేషన్పై ఏపి సిఎం సమీక్ష
హైదరాబాద్: ఏపిలో మొత్తం 54 ప్రాజెక్టులపై ఆ శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సిఎం చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. త్వరిత గతిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయడానికి ఈ సమావేశంలో నిర్ణయించారు. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి ఈ ఐదు బేషిన్ల కింద సాగునీరు అందుతున్నా... ఇంకా సాగునీరు అందని మండలాలను గుర్తించాలని, దీనిపై ఒక నివేదిక అందచేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఈ ఏడాదిలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను ప్రాధాన్యం తీసుకుని ప్రాజెక్టుల నిర్మాణం కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ బేసిన్ల పరిధిలో ఉన్న చెరువులు అన్నిటికి కూడా సాగునీటి సదుపాయాన్ని అందించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆయన అన్నారు. అనంతరం రెవెన్యూశాఖపై చంద్రబాబు సమీక్ష కొనసాగించారు. భూముల వివరాలు, కంప్యూటరీకరణపై ఆయన చర్చించారు. ఏపీలోని 13 జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భూములకు సంబంధించి డిజిటలైజేషన్ త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఉన్నతాదికారులకు సూచించారు.
ముగిసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ
ఢిల్లీ: ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశంలో ముగిసింది. సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఐఏఎస్, ఐపిఎస్ల పంపిణీకి సంబంధించిన అభ్యంతరాలపై సుమారు 3గంటలపాటు సాగిన ఈ సమావేశంలో చర్చించారు. అయితే ఈ భేటీలో భార్యాభర్తలైన అధికారుల అంశం చర్చకు రాలేదు.
దాదాపు వందమంది అభ్యంతరాలను కమిటీ పరిశీలించింది. ముసాయిదాలో పెద్దగా మార్పు లేనట్లుగా సమాచారం. కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల అభ్యంతరాలు, ప్రాంతాల మార్పుపై డిఓపిటి నిర్ణయం తీసుకోనుంది.