రియల్టర్ హత్య: వైవాహికేతర సంబంధమే కారణమా?
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో రియల్ ఎస్టేట్ వ్యాపారి యద్దనపూడి భ్రమరాచారి (39) సోమవారం స్థానిక లాయర్ పేట వద్ద గల సాయిబాబా గుడి సమీపంలో దారుణ హత్యకు గురయ్యారు. భ్రమరాచారి హత్యకు కారణం అతని స్నేహితుడు మేడపి విష్ణు , భ్రమరాచారికి మధ్య ఆర్థిక లావాదేవీలు, లేదా వివాహేతర సంబంధమే కారణం అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఒంగోలు పోలీసుల కథనం మేరకు జిల్లాలోని కొనకనమెట్ల మండలం మూగచింతల గ్రామానికి చెందిన యద్దనపూడి భ్రమరాచారి గత 11 ఏళ్ల క్రితం ఒంగోలులోని దిబ్బల రోడ్లో నివాసం ఉంటూ నక్షత్ర రియల్ ఎస్టేట్ సంస్థలో ప్లాటులను అమ్మిపెట్టే కమిషన్ ఏజెంట్గా పనిచేసేవాడు. ఇతనితోపాటు మేడపి విష్ణు కూడా కమిషన్ ఏజెంటుగా పనిచేసేవాడు.
కొద్ది రోజులకు నక్షత్ర రియల్ ఎస్టేట్ సంస్థ మూత పడింది. తర్వాత కొంతకాలానికి ప్రైవేట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే ఇటీవల కాలంలో భ్రమరాచారికి ఆమె భార్య భ్రమరేశ్వరికి మధ్య కలహాలు రావటంతో గత నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి కొబ్బరి బొండాల కత్తితో భ్రమరాచారిని నరకడంతో ఆయన అక్కడికి అక్కడే కుప్పకూలి మృతిచెందాడు. భ్రమరాచారి హత్యకు అతని స్నేహితుడు విష్ణుయే కారణం అయి ఉండవచ్చని తాము భావిస్తున్నామని పోలీసులు చెప్పారు.