ఐఎం బెదిరింపు: హైదరాబాద్ ఎయిర్పోర్టులో రెడ్ అలర్డ్
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశంలోని ముఖ్య ప్రాంతాలు, మెట్రో నగరాల్లో బాంబులతో విధ్వంసం సృష్టించనున్నామంటూ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మహారాష్ట్రలోని ముంబై పోలీస్ కమిషనర్కు లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సోమవారం విమానాశ్రయ భద్రతాధికారులతో అంతర్గత భద్రతపై చర్చించారు. దేశవాళీ, అంతర్జాతీయ రాకపోకల ప్రవేశ ద్వారాలు, సందర్శకులు ఉండే ప్రాంతాల్లో భద్రతా చర్యలను సమీక్షించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు వీలుగా అదనంగా పోలీస్, విమానాశ్రయ భద్రతా సిబ్బందిని మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముంబై పైన దాడులు చేస్తామని, దమ్ముంటే అడ్డుకోవాలని ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ పేరుతో ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు మూడు రోజుల క్రితం ఓ బెదిరింపు లేఖ వచ్చింది. గాజాలో దాడులకు ప్రతీకారంగా దాడులకు దిగుతామని తనకు అందిన లేఖలో ఉన్నట్లు కమిషనర్ చెప్పారు.
దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగర వ్యాప్తంగా బందోబస్తును కట్టుదిట్టం చేసింది. ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఉగ్రవాద నిరోధక శాఖ కూడా హెచ్చరికలను జారీ చేసింది. జులై 25వ తేదీన రాత్రి ఒక పేజీతో కూడిన బెదిరింపు లేఖ పోలీసు కమిషనర్కు అందింది.