కేసీఆర్ నా ఇంటిముందు నిలబడ్డా: రేవంత్, తలసానిపై..
హైదరాబాద్: తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లుగా జరుగుతున్న ప్రచారం పైన మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ శాసన సభ్యుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత రేవంత్ రెడ్డి మంగళవారం తీవ్రంగా స్పందించారు. పలువురు తెలంగాణ టీడీపీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు కారు ఎక్కే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.
దీనిపై రేవంత్ రెడ్డి ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహా ఎమ్మెల్యేలు అందరు వచ్చి తన ఇంటి ముందు నిలబడినా తాను తెరాసలో చేరనన్నారు. కొత్త ప్రభుత్వం కదా అని ఏదో సంయమనం పాటిస్తే తెరాసలో చేరుతారని ప్రచారం చేయడమేమిటని ప్రశ్నించారు.
తాను ఎట్టి పరిస్థితుల్లో తెరాసలో చేరనన్నారు. తన పైన అనవసర ప్రచారం చేస్తున్నట్లే హైదరాబాదులోని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన కూడా ప్రచారం చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. తలసానికి పార్టీ పట్ల ఎలాంటి అసంతృప్తితో ఉన్నారో తెలియదన్నారు. పోలవరం విషయంలో టీడీపీ నేతలు పార్టీ మారుతారను తాను అనుకోవడం లేదన్నారు.
దుష్ప్రచారం: వివేకానంద
తాను పది రోజులు అమెరికాకు వెళ్తే తెరాసలో చేరుతానని దుష్ప్రచారం చేయడం తగదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. తాను తెరాసలో చేరుతున్నట్లుగా వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.