ఎల్అండ్టీకి బెదిరింపు, నేనే చెప్పా: కేసీఆర్పై రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎల్ అండ్ టీని బెదిరించి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడించారని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మెట్రో రైలు అంశంపై విలేకరులతో మాట్లాడారు.
మెట్రో కారు పార్కింగ్ కోసం కేటాయించిన భూమిని మరొకరికి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఓ వ్యక్తికి లాభం చేకూర్చేందుకు తెరాస ప్రభుత్వం పని చేస్తోందా చెప్పాలని ప్రశ్నించారు. కొందరి స్వార్థం కోసం రకరకాల భూమార్పిడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కేటాయించిన భూములను రద్దు చేసి ఓ వ్యక్తికి ఇస్తున్నారని విమర్శించారు.
మెట్రోకు కేటాయించిన భూమి పైన ఎల్ అండ్ టీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రభుత్వానికి లేఖలు రాయలేదా అని ప్రశ్నించారు. అఫ్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భూకేటాయింపు తప్పంటే ఇప్పుడెలా ఒప్పవుతుందని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి పక్కన పెట్టిన దస్త్రాలను సీఎం అయిన వెంటనే కేసీఆర్ ఆమోదించారన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందన్నారు. మెట్రో రైలు విషయమై తానే ఆరోపణలు చేశానని, దీనికి జవాబు చెప్పకుంటా ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోందని ధ్వజమెత్తారు. తన ఆరోపణలకు మొదట సమాధానాలు చెప్పాలని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి పైన కేసీఆర్కు చిత్తశుద్ధి లేదన్నారు.
అక్రమంగా కొల్లగొడుతున్న దొరల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్ కుటుంబ సంపాదన, మెట్రో, పాలన, అవినీతి పైన చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మెట్రో రైలు నిర్మాణం పైన అఖిలపక్షం నిర్వహించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయాలను అఖిలపక్షం ముందు ఉంచాలన్నారు. అవినీతి పైన బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే మెట్రో పనులు పూర్తి చేయాలన్నారు. తెరాస సన్నిహితులకు ప్రభత్వం కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెడుతోందని ఆరోపించారు.