చేవెళ్ల: విశ్వేశ్వర్రెడ్డితో మాజీహోంమంత్రుల కొడుకులు ఢీ
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఇటీవల తెరాసలో చేరడం టిడిపికి మింగుడు పడని అంశం. అదే సయమంలో కాంగ్రెస్, తెరాస పట్టు పెంచుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరపున తాండూరు, వికారాబాద్, పరిగిలో ఎమ్మెల్యేలుగా గెలిచిన మహేందర్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, కెఎస్ రత్నం తెరాసలో చేరడంతో ఈ నియోజకవర్గాల్లో టిడిపికి గట్టి దెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల సమయంలో కొందరు ద్వితీయ శ్రేణి నేతలు సైతం గులాబీ దండులో చేరారు. ఇంకొందరు కాంగ్రెస్లోకి వెళ్లారు.
అయితే, క్యాడర్ పైన టిడిపి నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రేటర్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి బాగుంది. టిడిపి ప్రధానంగా సెటిలర్ల పైన ఆశలు పెట్టుకుంది. చేవెళ్ల లోకసభ పరిధిలోని మొత్తం ఓటర్లలో పట్టణ ప్రాంతాల్లోనే సగానికి పైగా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో సెటిలర్లది కీలక పాత్ర కానుంది. అధిక ఓటర్లు ఉన్న శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ పరిధిలో భారీ ఓట్లు సాధించేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది.
ఒక్క శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ఆరు లక్షల ఓటర్లు ఉన్నారు. తాండూరు, వికారాబాద్, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లతో ఈ ఒక్క నియోజకవర్గం ఓట్లు సమానం. ఇక్కడ సగానికిపైగా సెటిలర్లు ఓట్లు ఉన్నాయి. వీరేందర్ గౌడ్ బరిలో దిగడంతో బిసి ఓటర్లపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇక బిజెపితో పొత్తు కలిసి వస్తుందంటున్నారు. లోక్సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా అభ్యర్థులను రంగంలో దింపడంతో టిడిపి ఓటు బ్యాంకుకు కొంత గండిపడే అవకాశముంది.
తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాలలో పట్ట్టు కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు బలమైన అభ్యర్ధులు ఉండడంతో పాటు సబితా రెడ్డి కుటుంబానికి కూడా ఇక్కడ పట్టు ఉండడంతో కాంగ్రెస్ ఈ నియోజకవర్గాలపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. సబితా రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మహేశ్వరంలో తిరిగి బలం పుంజకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. ఇక పట్టణ ప్రాంతాల ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ పార్లమెంట్ పరిధిలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెరాస ప్రభావం అంతగా కనిపించేది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తరువాత పరిస్థితులు మారిపోయాయి. టిడిపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్సీ తెరాసలో చేరడంతో ఒక్కసారిగా పార్టీ బలం పెరిగింది. ఇది విశ్వేశ్వర్ రెడ్డికి కలిసి రానుంది.